Superstar: తలైవా పిలిచారు పదండి, మళ్లీ రజనీ మీటింగ్, ఈ సారి అర్జునుడు ఎంట్రీ, సమయం లేదు మిత్రమా!
చెన్న/మదురై/న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ అభిమాన సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. ఇటీవల అభిమాన సంఘాల నాయకులతో సమావేశమైన తరువాత తాను రాజకీయాల్లోకి పక్కా వస్తానని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ మరోసారి చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమాన సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు.
ఈ సారి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు మరో ఇద్దరు ప్రముఖులు అభిమాన సంఘాల నాయకులు. తలైవా సన్నిహితులతో క్షుణ్ణంగా చర్చించి మనం ఏం చెయ్యాలి ? అని చర్చలు జరుపుతున్నారు. రజనీ అత్యంత సన్నిహితుడు అర్జున మూర్తితో పాటు తమిళ్రూవి మణియన్ కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఆరోజు ఇది జరిగింది
గత నెల నవంబర్ 30వ తేదీ సోమవారం చెన్నైలోని కోడంబాక్కంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ కు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ మక్కల్ మండ్రం పార్టీ నాయకుల సమావేశం అయ్యారు. తమిళనాడులోని 38 జిల్లాలకు చెందిన 52 మంది రజనీ పార్టీ అభిమాన సంఘాల ముఖ్య నాయకులు, రజనీ మక్కల్ మండ్రం పార్టీ కార్యవర్గ సభ్యులు ఆ రోజు జరిగిన సమావేశానికి హాజరైనారు. ఆరోజు మీటింగ్ పూర్తి అయిన తరువాత తలైవా రజనీకాంత్ ఏమి చెబుతారు ? అంటూ ఆయన అభిమానులు తీవ్ర ఉత్కంఠకు గురైన విషయం తెలిసిందే.
రజనీ పక్కాక్లారిటీ ఇచ్చేశారు
చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమాన సంఘాల నాయకులతో మాట్లాడిన తరువాత బయటకు వచ్చిన రజనీకాంత్ చెనైలోని పూజా గార్డెన్ లో మీడియాతో మాట్లాడారు. తన అభిమాన సంఘాల నాయకులతో తాను మాట్లాడాను, వారి అభిప్రాయాలు సేకరించాను. తన రాజకీయ రంగప్రవేశం గురించి త్వరలో పూర్తి సమాచారం వెల్లడిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాకు చెప్పారు. అయితే రెండు రోజుల తరువాత తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ ట్విట్ చేసి పక్కా క్లారిటీ ఇచ్చేశారు.
ఆరోగ్యం సహకరించలేదు
తన అభిమాన సంఘాల నాయకులు వారివారి జిల్లాల్లోని పరిస్థితుల గురించి, అభిమానుల ఆకాంక్ష గురించి తనకు వివరించారని రజనీకాంత్ అన్నారు. అభిమానుల ఆశయాలకు అనుగునంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, కచ్చితంగా తమిళ ప్రజలకు సేవ చేస్తానని తలైవా రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని, ప్రజలే తన విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు.
కిడ్నీ మార్పిడి.. కరోనాతో ఆలస్యం
రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ 31వ తేదీన తాను పక్కా రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ చెప్పినా 2020 డిసెంబర్ వరకు ఆ శుభముహూర్తానికి టైమ్ కలిసిరాలేదు. తనకు కిడ్నీ మార్పిడి జరిగిందని, అనారోగ్యంతో ప్రజలకు న్యాయం చెయ్యలేనని ఆందోళనతో ఇంతకాలం రాజకీయాల గురించి పట్టించుకోలేదని, ఇదే సమయంలో కరోనా వైరస్ (COVID-19) వ్యాధి విరుచుకుపడటంతో అంటువ్యాధుల భయంతో రాజకీయాలకు దూరం అయ్యానని, ఇక ఆలస్యం చెయ్యనని రజనీకాంత్ వివరణ ఇచ్చారు.
తలైవా పిలిచారు పదండి
గత నెల 30వ తేదీన అభిమాన సంఘాల నాయకులతో సమావేశమైన రజనీకాంత్ మరోసారి వారితో సమావేశం అవుతున్నారు. ఈ సారి రజనీకాంత్ తో పాటు ఆయన కొత్త రాజకీయ పార్టీ కార్యక్రమాలు చూసుకోవడానికి సిద్దం అయిన తమిళ్రూవి మణియన్, అర్జున మూర్తి కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ తో మాట్లాడి వారికి దిశానిర్దేశం చెయ్యడానికి సిద్దం అయ్యారు. చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలోనే రజనీకాంత్ ఫ్యాన్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన మీటింగ్ లో 52 మంది ప్రముఖులు హాజరుకావడంతో ఈ సారి ఆ సంఖ్యను మరింత పెంచారని రజనీకాంత్ సన్నిహితులు అంటున్నారు.