ఆ వ్యవహారంలో తమిళ నటుడు శ్యామ్ అరెస్టు.. చెన్నైలోని తన నివాసంలో..!
చెన్నై: చెన్నైలో గ్యాంబ్లింగ్ నడుపుతున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ప్రముఖ నటుడు శ్యామ్ కూడా ఉన్నారు. నుంగంబాక్కం ప్రాంతంలో ఉన్న శ్యామ్ అపార్టుమెంటులో ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఫ్లాట్పై దాడులు నిర్వహించి వీరందరినీ అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి గ్యాంబ్లింగ్కు వినియోగించే టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ గ్యాంబ్లింగ్లో మరింకొందరు పేరుగాంచిన తమిళ నటులు కూడా ఉన్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తెలుగులో శ్యామ్ పలు సినిమాల్లో నటించారు. కిక్, రేసుగుర్రంతో పాటు ఇతర సినిమాల్లో కూడా నటించాడు.
గ్యాంబ్లింగ్ వ్యవహారంలో శ్యామ్ అరెస్టు
గ్యాంబ్లింగ్ వ్యవహారాన్ని రాత్రి వేళల్లో నటుడు శ్యామ్కు చెందిన ఫ్లాట్ నుంచి నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. లాక్డౌన్ సమయం నుంచి ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తమ విచారణలో వెల్లడైనట్లు చెప్పారు. అయితే శ్యామ్తో పాటు ఇతర తమిళ నటులను అరెస్టు చేశారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అపార్ట్మెంట్లోనే గ్యాంబ్లింగ్కు పాల్పడుతూ భారీ మొత్తంలో ఒక నటుడు నష్టపోవడంతో అనధికారిక సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే శ్యామ్తో పాటు మిగతా 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు వీరు ఈ జూదాన్ని ఎలా నడిపారు.. ఇంకా ఎవరెవరూ ఇక్కడ గ్యాంబ్లింగ్ ఆడేవారు అనే అంశాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఆన్లైన్ గేమ్స్కు బానిసై విద్యార్థి ఆత్మహత్య
ఆన్లైన్గేమ్లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి భారీగా డబ్బులు నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన కేసు వెలుగు చూసిన ఘటనలో శ్యామ్ ఇంట్లో జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకుని దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆన్లైన్ గేమ్ ఆడి రూ.20వేల నష్టపోయాడు ఆ విద్యార్థి. ఆ డబ్బును తను పనిచేసే చోట నుంచి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. డబ్బులు పోగొట్టుకోవడంతో ఒక్కింత డిప్రెషన్కు గురైన విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు చెప్పారు.
Recommended Video
తెలంగాణ ప్రభుత్వ చర్యలను గుర్తు చేసిన మద్రాస్ హైకోర్టు
ఈ మధ్యనే ఆన్లైన్ గేమ్స్ /గ్యాంబ్లింగ్లపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ గేమ్స్ / గ్యాంబ్లింగ్లకు అలవాటు పడుతున్న యువత ప్రాణాలు తీసుకుని తమ కుటుంబ సభ్యులకు బాధను మిగుల్చుతున్నారని పేర్కొంటూ దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. ఈ సందర్భంగా న్యాయస్థానం పేకాటతో పాటు జూదంతో ముడిపడి ఉన్న పలు ఆటలను గుర్తించింది. ఇందులో రమ్మీ ప్యాషన్, నజారా, లియో వెగాస్, స్పార్టన్ పోకర్, ఏస్2త్రీ, పోకర్ దంగల్, పాకెట్ 52, మై 11 క్రికెట్ మరియు జెనెసిస్ కాసినోలాంటిని లిస్ట్ చేసింది ధర్మాసనం. లాటరీ ఇతర ప్రమాదపు ఆటలపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఆన్లైన్ గేమ్స్ పై నిషేధం విధించిందన్న విషయాన్ని గుర్తు చేసింది మద్రాస్ హైకోర్టు.