ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం: ఏపీ సిమెంట్ లారీ విధ్వంసం: డ్రైవర్ ఎస్కేప్
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన లారీ జాతీయ రహదారిపై విధ్వంసాన్ని సృష్టించింది. ఏకంగా పది వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. సంఘటనా స్థలం నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. తమిళనాడులోని ధర్మపురం జిల్లా తొప్పూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన సంభవించింది.
రెచ్చిపోయిన రైతు ఉద్యమ మద్దతుదారులు: మహాత్ముడి విగ్రహం ధ్వంసం: ఖలిస్తాన్ జెండాలతో
ధర్మపురి-సేలం జిల్లాల సరిహద్దుల్లోని ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తోన్న ఓ లారీ అదుపు తప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సిమెంట్ లోడ్తో బయలుదేరిన ఈ లారీ తొప్పూర్ జాతీయ రహదారి మీదుగా వెళ్తోన్న సమయంలో పాళయం ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. ఓ కంటైనర్ను తొలుత ఢీ కొట్టింది. దీనితో ఈ రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి. దీన్ని గమనించని ఇతర వాహనాలు వేగంగా వచ్చి లారీ, కంటైనర్లను ఢీ కొట్టాయి. ఇలా ఏకంగా 10కి పైగా వాహనాలు ఒకదాని వెంట ఒకటి ఢీ కొట్టాయి. వాటిల్లో ప్రయాణిస్తోన్న నలుగురు మరణించారు.
ఈ ఘటనతో సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. వాటిని తొలగించడానికి క్రేన్లను తెప్పించాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి కారణమైన సిమెంట్ లారీ డ్రైవర్ తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ధర్మపురి జిల్లా కలెక్టర్ కార్తీక, ఎస్పీ ప్రవేశ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ధర్మపురిలోని మోహన్ కుమారమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.