తమిళనాడు అల్లకల్లోలం: చెరువులను తలపిస్తోన్న చెన్నై వీధులు: ఏకధాటిగా: తీరం బిక్కుబిక్కు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు అతలాకుతలమౌతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాజధాని చెన్నై సహా అనేక జిల్లాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై వీధులు చెరువులను తలపిస్తున్నాయి. 400 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సమయంలోనే ఈ స్థాయిలో నివార్ తుఫాన్ ప్రభావాన్ని చూపిస్తోందంటే.. తీరానికి చేరువ అయ్యే కొద్దీ దాని తీవ్రత మరింత ఉధృతమౌతుందని, విలయాన్ని సృష్టించక తప్పదనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
#NivarCyclone #Chennai #LiveView pic.twitter.com/3ie0ElXmrO
— Saikiran Kannan (@saikirankannan) November 23, 2020
తీరానికి 520 కిలోమీటర్ల దూరంలో
మంగళవారం తెల్లవారు జామున 2:30 గంటల సమయానికి ఈ తుఫాన్ పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 460 కిలోమీటర్లు.. చెన్నైకి ఈశాన్య దిశగా 420 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా అది కదులుతోంది. గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, బుధవారం మధ్యాహ్నం మామళ్లాపురం-కరైకల్ మధ్య తీరాన్ని దాటొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంత బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. దాని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో కనీసం 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదుకానుందని తెలిపారు.
రెడ్ అలర్ట్ జారీ..
నివార్ ప్రభావం వల్ల తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి- తీర ప్రాంతా జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. అరియలూరు, మ్యాదుతురై, తంజావూరు, తిరువరూరు, నాగపట్టిణం, కడలూర్, విల్లుపురం, తిరువణ్ణామలై, కాళ్లకురిచ్చి, పెరంబలూర్ల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాలు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టుతో పాటు తీరానికి దూరంగా ఉన్న వేలూరు, ధర్మపురి, తిరుపత్తూర్, కృష్ణగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ఇచ్చారు.
ఎన్డీఆర్ఎఫ్ మోహరింపు..
తుఫాన్ హెచ్చరికలతో తమిళనాడు ప్రభావం అప్రమత్తమైంది. తీరంలోని మత్స్యకార గ్రామాలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తోంది. పెద్దఎత్తున జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేసింది. కడలూర్, చిదంబరం, అరియలూర్ వంటి ప్రాంతాలను కేంద్రబిందువుగా చేసుకుని అక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అవసరమైన ప్రదేశాలకు తరలిస్తోంది. ప్రాణనష్టాన్ని నివారించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ తమిళనాడు ప్రభుత్వం వినియోగించుకుంటోంది.
Recommended Video
సీమ జిల్లాలకూ తుఫాన్ ప్రభావం
నివార్ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడుకు ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బుధ, గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో.. దాని ప్రభావం ప్రకాశం జిల్లా వరకూ విస్తరించడానికి అవకాశం ఉందని అంచనా వేశారు.