ఉమ్మడి శతృవు మోడీతో ఢీ: కమల్ హాసన్-ఒవైసీ దోస్తీ: ఎంఎన్ఎం-ఎంఐఎం పొత్తు: రజినీ ఎంట్రీతో
చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, సరికొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చొన్న డీఎంకే.. అధికారాన్ని అందుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అండతో..వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికార అన్నా డీఎంకే పావులను కదుపుతోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించింది. అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఇవ్వబోతోండటం తమిళ రాజకీయాల్లో కొత్త పొత్తులకు దారి తీసింది.
బీజేపీ-ఏఐఏడీఎంకేను నిలువరించడానికి
బీజేపీ-ఏఐఏడీఎంకేను నిలువరించడానికి తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త పొత్తులు తెర మీదికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ-అన్నా డీఎంకే ఒకవంక- డీఎంకే, ఇతర బీజేపీయేత పక్షాలు మరోవంక ఎన్నికల బరిలోకి దిగబోతోన్నాయి. రజినీకాంత్ పార్టీ ప్రస్తుతానికి స్వతంత్రంగానే పోటీ చేస్తోంది. ఏ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ఇదివరకే పార్టీ జిల్లా కార్యదర్శులు, అభిమాన సంఘాలతో నిర్వహించిన భేటీలో స్పష్టం చేశారు.
కొత్త పొత్తులకు తెర తీసినట్టే..
రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతోండటం.. ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందనేది ఇప్పుడిప్పుడే అంచనా వేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. సహజంగా.. తమిళనాడు రాజకీయాలు బీజేపీకి వ్యతరేకంగా ఉంటూ వచ్చాయి. గత ఏడాది ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే చావుదెబ్బ తిన్నాయి. ఒకేఒక్క స్థానానికి పరిమితం అయ్యాయి. ప్రతిపక్ష డీఎంకే లోక్సభ స్థానాలను క్లీన్స్వీప్ చేసింది. ఇదే తరహా ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురవుతాయనే అంచనాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రజినీకాంత్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఓట్లు చీలుతాయనే అభిప్రాయం ఏర్పడటానికి కారణమౌతోంది.
ఓట్ల చీలికను అడ్డుకోవడానికి..
ఓట్ల చీలికను అడ్డుకోవడానికి కొత్త పొత్తులు తమిళ రాజకీయాల్లో వెలుగు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. భావసారూప్యం గల పార్టీలన్నీ ఏకతాటి మీదికి వచ్చే సంకేతాలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా లోక నాయకుడు కమల్ హాసన్ నెలకొల్పిన మక్కల్ నీథి మయ్యం, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సారథ్యాన్ని వహిస్తోన్న అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మధ్య పొత్తు పొడవచ్చని అంటున్నారు. ఈ రెండు పార్టీలూ బీజేపీ సిద్ధాంతాన్ని గట్టిగా వ్యతిరేకించేవే. 2011 జనాభా లెక్కల ప్రకారం.. తమిళనాడులో 5.86 శాతం మేర ముస్లింలు ఉన్నారు. మెజారిటీ ఓట్లు ఎంఎన్ఎం-ఎంఐఎంకు పడేలా ప్రణాళికను రూపొందించుకోవచ్చని చెబుతున్నారు.
కనీసం పాతిక సీట్లకు మజ్లిస్ పోటీ..
మక్కల్ నీథి మయ్యంతో సీట్లు సర్దుబాటు చేసుకోవడానికి మజ్లిస్ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ పార్టీతో కలిసి కనీసం 25 సీట్లల్లో పోటీ చేయడానికి ఒవైసీ పచ్చజెండా ఊపారని అంటున్నారు. దీనికోసం త్వరలో కమల్ హాసన్ హైదరాబాద్కు వస్తారని, పాతబస్తీ దారుస్సలాంలోని మజ్లిస్ కార్యాలయంలో ఒవైసీతో సమావేశమౌతారని చెబుతున్నారు. జనవరి నాటికల్లా సీట్లను సర్దుబాటు చేసుకోవచ్చని సమాచారం. తిరుచ్చి, చెన్నైల్లో ఉమ్మడిగా బహిరంగ సభలను ఏర్పాటు చేసి, సీట్ల సర్దుబాటు విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.