అమిత్ షాతో రజినీకాంత్ భేటీ?: బీజేపీలో చేరిక లాంఛనప్రాయమా? బంపర్ ఆఫర్: అటో..ఇటో
చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడులో పాగా వేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా- బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా చెన్నైలో మకాం వేశారు. పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకుంది బీజేపీ. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. చేదు ఫలితాలను చవి చూశాయి.
తమిళనాడుపై కన్నేసిన అమిత్ షా..
ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా కమలనాథులు ముందు జాగ్రత్త చర్యల్లో పడ్డారు. అన్నాడీఎంకేతో పొత్తును కొనసాగిస్తూనే.. కొత్త పార్టీలు, తటస్థ నేతలను కలుపుకొనే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ క్రమంలో- దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ను పార్టీలో చేర్చుకునే దిశగా వ్యూహాలను రూపొందించుకుంది బీజేపీ. ఆయనతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరిని కూడా పార్టీ కండువా కప్పే అవకాశాలు లేకపోలేదు.
రజినీకాంత్, అళగిరిలతో భేటీకి ఛాన్స్?
రెండురోజుల పర్యటన కోసం చెన్నైకి వచ్చిన అమిత్ షాను రజినీకాంత్, అళగిరి కలుస్తారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఊపందుకుంది. అదే జరిగితే- బీజేపీలో చేరిక లాంఛనమే కావచ్చని అంటున్నారు. బీజేపీ పెద్దల విజ్ఙప్తి మేరకే కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనలను రజినీకాంత్ విరమించుకున్నారంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. రజినీకాంత్..బీజేపీని బాహటంగా సమర్థించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు.. వంటి చర్యలను రజినీకాంత్ ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేశారు.
బంపర్ ఆఫర్ ఖాయమా?
రజినీకాంత్ బీజేపీలో చేరడమంటూ జరిగితే.. ఆయనకు అత్యున్నత పదవిని అప్పగించేలా ఆఫర్ ఇచ్చారనే వార్తలు తమిళ రాజకీయాల్లో వ్యక్తమౌతున్నాయి. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయొచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి బీజేపీ తదుపరి చర్యలు ఉంటాయని సమాచారం. ప్రత్యక్ష ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేయకపోయినప్పటికీ.. మద్దతు ఇచ్చినా సరిపోతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
క్రియాశీలక రాజకీయాలకు ఇదే సమయం..
రజినీకాంత్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఇదే సమయం. ఏ నిర్ణయాన్నయినా అసెంబ్లీ ఎన్నికల్లోపే తీసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ముగిస్తే.. మరో అయిదేళ్ల వరకూ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు ఆయనకు దక్కకపోవచ్చు. అందుకే- ఈ సారి రజినీకాంత్ అటో, ఇటో తేల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి.. ఈ దిశగా రజినీకాంత్ను ఒప్పించే బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
డీఎంకే ఓట్లకు ఎసరు పెట్టేలా..
కరుణానిధి కుమారుడు, స్టాలిన్ సోదరుడు అళగిరిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా డీఎంకేకు పడే ఓట్లను చీల్చ వచ్చని బీజేపీ భావిస్తోంది. డీఎంకే సామర్థ్యం ఏమిటో ఇప్పటికే లోక్సభ ఎన్నికల ద్వారా అంచనా వేయగలిగింది బీజేపీ. లోక్సభ స్థానాలను డీఎంకే స్వీప్ చేయగలిగింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలంగా ఉంది. రెండు దఫాలుగా అన్నా డీఎంకే అధికారంలో ఉండటం వల్ల ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేక పవనాలతో పాటు డీఎంకే ఓటు బ్యాంకును చీల్చడానికి అళగిరి ఉపయోగపడతాడని బీజేపీ భావిస్తోంది.