సన్యాసమా?..రంగ ప్రవేశమా?: తేలేది రేపే: రజినీకాంత్ కీలక భేటీ: బీజేపీ వైపేనా?
చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఇప్పుడిప్పుడే అక్కడి రాజకీయం వేడెక్కుతోంది. క్రమంగా ఎన్నికల మూడ్లోకి వెళ్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా సరిగ్గా వారం రోజుల కిందట తమిళనాడులో పర్యటించి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఈ వారం రోజుల్లో తమిళనాడులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాల ప్రభావం ఏమిటనేది సోమవారం తేలిపోనుంది. అదే- ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
పార్టీ ప్రకటించినా..
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే వార్త చాన్నాళ్ల నుంచీ చక్కర్లు కొడుతోంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు కొన్నేళ్ల నుంచీ ఎదురు చూస్తున్నారు. పలు దఫాలుగా ఆయన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. తన అభిమాన సంఘాల ప్రతినిధుల నుంచీ అభిప్రాయాలను సేకరించారు. రాజకీయ పార్టీని ప్రకటించారు గానీ.. దాన్ని క్రియాశీలకంగా మార్చలేకపోయారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఆ దిశగా ఎలాంటి సంకేతాలను సైతం ఇవ్వలేకపోయారు. సినిమాల పైనే దృష్టి సారించారు.
పార్టీ నేతలతో రజినీకాంత్ కీలక భేటీ..
ఈ పరిణామాల మధ్య.. సోమవారం రజినీకాంత్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ పదాధికారులు, జిల్లాల కార్యదర్శులతో భేటీ కానున్నారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. పరిమిత సంఖ్యలో ఈ సమావేశం ఉండొచ్చని తెలుస్తోంది. పార్టీలో వివిధ దశల్లో ఉన్న క్యాడర్, అభిమాన సంఘాల ప్రతినిధులతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రజినీకాంత్ మంతనాలను నిర్వహించనున్నారు. అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
ఆ నిర్ణయం ఎలా ఉండొచ్చు..
రాజకీయాలపై రజినీకాంత్ చేసే ఎలాంటి ప్రకటన అయినా పెను సంచలనాన్ని సృష్టించడం ఖాయం. ప్రస్తుతం రజినీకాంత్ ముందు మూడు మార్గాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకటి- రాజకీయాల నుంచి తప్పుకోవడం. పార్టీని కూడా ప్రకటించిన తరువాత ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోలేకపోవచ్చు. రెండు- వచ్చే ఏడాదిన నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలపడం. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం. మూడు- బీజేపీ వైపు మొగ్గు చూపడం. ఆయన నిర్వహించ తలపెట్టిన సమావేశం.. ఈ మూడు అంశాల చుట్టే తిరుగుతుందని అంటున్నారు.
Recommended Video
బలమైన రెండు పార్టీలను ఎదుర్కొనగలుగుతుందా
తమిళనాడు రెండు బలమైన పార్టీలు పాతకునిపోయాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నా డీఎంకే, స్టాలిన్ సారథ్యంలోని ప్రతిపక్ష డీఎంకేను ఢీ కొని రజినీకాంత్ స్థాపించిన రజినీ మక్కళ్ మండ్రం.. ఎన్నికల్లో నిలవగలుగుతుందా? అనేది ఆసక్తికర పరిణామమే. ఇదివరకు రజినీకాంత్.. పలు సందర్భాల్లో బీజేపీని ప్రశంసిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం వంటి ఒకట్రెండు కీలక అంశాలపై స్పందించలేదు. ఆయన వైఖరి ముందు నుంచీ బీజేపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది. రజినీ మక్కళ్ మండ్రం పార్టీ తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.