బాబోయ్ మళ్లీ లాక్డౌన్: నెలరోజుల పాటు: పక్క రాష్ట్రంలోనే
చెన్నై: దేశంలో మళ్లీ లాక్డౌన్ తరహా పరిస్థితుల్లోకి జారిపోతోన్నట్టు కనిపిస్తోంది. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల అనేక రాష్ట్రాలను కమ్మేసింది. కరోనా కేసుల్లో భారీగా పెరుగుతున్నాయి. రోజూ వేలల్లో నమోదవుతోన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్న జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలన్నీ నిర్దేశిత సమయం వరకే నడుస్తోన్నాయి. కొన్ని రాష్ట్రాలు సరిహద్దులను పాక్షికంగా మూసివేశాయి. కరోనా నెగెటివ్ ఉంటేనే అంతర్ రాష్ట్ర రాకపోకలకు అనుమతి ఇస్తున్నాయి.
తమిళనాడులో మార్చి 31 వరకు
ఇవే తరహా లాక్డౌన్ పరిస్థితులు.. మరింత విస్తరించాయి. తాజాగా తమిళనాడు లాక్డౌన్ను విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉండబోోతోంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లాక్డౌన్ మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్న చోట సెక్షన్ 144 అమల్లో ఉంటుందని తెలిపింది. పాఠశాలలు, కళాశాలలు, మెట్రో రైళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలను కరోనా మార్గదర్శకాల జాబితా కిందికి చేర్చింది. ఇదివరకట్లా కరోనా వ్యాప్తి చెందకుండా చేపట్టిన ముందు జాగ్రత్తలన్నింటినీ పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.
షాపింగ్ మాల్స్.. ఫంక్షన్ హాల్స్..
హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఫంక్షన్ హాళ్లు, యోగా కేంద్రాలు, జిమ్ సెంటర్లు.. ఇలా ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాల్లో కరోనా మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంటుందని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను ఇచ్చింది. వాటిని పాటించని వారిపై ప్రకృతి వైపరీత్యాల నివారణ చట్టం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్న ప్రాంతాలను కంటైన్మెంట్లు జోన్లుగా ప్రకటించాల్సి ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం.. ఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అలాంటి ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలను నియంత్రించాల్సి ఉంటుందని జిల్లా అధికారులను ఆదేశించింది.
ఎన్నికల వేళ..
తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. వచ్చేనెల 6వ తేదీన అక్కడ పోలింగ్. ఈ నేపథ్యంలో- అన్ని పార్టీలు ప్రచార కార్యకలాపాలపై దృష్టి సారించాయి. విస్తృతంగా ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తోన్నాయి. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో తమిళనాడు సందడిగా మారింది. ఈ పరిణామాల మధ్య మళ్లీ పాక్షికంగా లాక్డౌన్ను అమల్లోకి తీసుకుని రావడం.. ఏకంగా నెల రోజుల పాటు కొనసాగింపజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీల ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయనే ఉత్కంఠత నెలకొంది. ప్రజలను ఎలా సమీకరిస్తారనేది ఆసక్తి రేపుతోంది.