ఎగ్జామ్స్ టైమ్: విద్యార్థులకు శుభవార్త చెప్పిన సర్కార్: బంపర్ ఆఫర్: ప్రైవేటు స్కూళ్లకూ
చెన్నై: మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. అధికార ఏఐఏడీఎంకే భవిష్యత్ ఏమిటో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన అన్నా డీఎంకే.. హ్యాట్రిక్పై కన్నేసినట్టు కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రణాళికలను రూపొందించుకుంటోంది. మూడోసారి అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలదలచుకోనట్టుగా కనిపిస్తోందా పార్టీ. అందుకే- ఎన్నికల ముంగిట్లో లక్షలాది మంది విద్యార్థులకు ఉచిత వరాలను ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిసితుల్లో కళాశాలలు మూతపడటం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తరగతులకు దూరం అయ్యారు. ఆన్లైన్ క్లాసులకు పరిమితం అయ్యారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కావడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీన్ని తొలగించడానికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. విద్యార్థులకు రోజూ 2జీబీ డేటాను ఉచితంగా అందించబోతోన్నట్లు వెల్లడించింది. నాలుగు నెలల పాటు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ నెల నుంచి ఏప్రిల్ వరకు విద్యార్థులకు 2జీబీ సామర్థ్యం గల డేటా కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. ఈ నాలుగు నెలల పాటు విద్యార్థులు తమ చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని, వారి సౌకర్యం కోసం ఉచిత డేటాను ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనివల్ల మొత్తం 9,69,047 మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్లకు ఈ ఉచిత డేటా పథకం వర్తిస్తుంది.