ఆరుగురితో అన్నాడీఎంకే తొలి జాబితా -పళని, పన్నీర్ స్థానాలివే -బీజేపీతో సీట్ల షేరింగ్ ఇంకా తేలలే
దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సందడిగా సాగుతున్నాయి. జయలలిత మరణం తర్వాత బీజేపీకి బాగా దగ్గరైపోయిన అధికారా అన్నాడీఎంకే అందరికంటే ముందుగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. బీజేపీతో సీట్ల షేరింగ్ ఇంకా తేలకముందే అన్నాడీఎంకే దూకుడు ప్రదర్శిస్తుండగం గమనార్హం.
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం ఆరుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. అందులో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఉన్నారు.
సీఎం పళని స్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం బోడినాయకనూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. దీంతో వారిద్దరూ సిట్టింగ్ స్థానాల నుంచే బరిలోకి దిగుతున్నారన్నది స్పష్టమైపోయింది. ఇక మరో వైపు డి. జయకుమార్ (రాయపురం), సీవీ షణ్ముగం (విల్లుపురం), ఎస్పీ షణ్ముగనాథం (శ్రీవైకుంఠం), తేన్మోళి (నీలకొట్టై) నుంచి బరిలోకి దిగుతున్నారు. కాగా,
కొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు తమకే అనుకూలంగా ఉన్నాయని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఓ పన్నీర్ సెల్వం అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈసారి తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గెలుస్తుందనే అంచనాలు ఉన్నట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అంచనాలను కాదని విజయం తమదేనని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.