విషాదం : వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత...
వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్(92) కన్నుమూశారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ... సోమవారం స్వాయంత్రం హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో తన నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. కృష్ణన్ మృతి సంగీత అభిమానులను విషాదంలో ముంచెత్తింది.
కృష్ణన్ కుటుంబానికి సన్నిహితుడైన అయ్యర్ అనే వ్యక్తి ఆయన మృతిపై స్పందించారు. 'గత నెలలోనే ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాం. అప్పుడాయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇటీవలి కాలంలోనూ ఆయన చురుగ్గానే కనిపించారు.' అని తెలిపారు.
టీఎన్ కృష్ణన్-లాల్గుడి జయరామన్-ఎంఎస్ గోపాలకృష్ణ వయోలిన్ త్రయంగా పేరు తెచ్చుకున్నారు. టీఎన్ కృష్ణన్ అక్టోబర్ 6,1928లో కేరళలోని త్రిపునిథురలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నారాయణ అయ్యర్-అమ్మిని అమ్మాల్. కృష్ణన్ తన తండ్రి నుంచి సంగీతాన్ని నేర్చుకున్నారు. మొదట్లో అలెప్పీ కె పార్థసారథి అనే గురువు పర్యవేక్షణలో సంగీత సాధన చేసేవారు. ఆ తర్వాత సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ అనే మరో గురువు వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు.
1942లో టీఎన్ కృష్ణన్ చెన్నైకి వచ్చారు. అప్పటినుంచి చెన్నై నగరంలోనే నివసిస్తున్నారు.కొన్నేళ్లు చెన్నై మ్యూజిక్ కాలేజీలో వయోలిన్ టీచర్గా పనిచేశారు.ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్గా కూడా పనిచేశారు.వేలాది కచేరీలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. 1973లో పద్మశ్రీ,1992లో పద్మభూషణ్,1974లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు,1980లో సంగీత కళానిధి అవార్డు అందుకున్నారు.