అన్ని రాష్ట్రాలకు సీఎం లు ఉన్నా ఏపీకి మాత్రమే మనసున్న సీఎం : జగన్ కు ఎమ్మెల్యే రోజా కితాబు
విశాఖపట్టణం మహా నగరంలోని ఆర్.ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి లీకైన ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ తో ఇప్పటికి 12 మంది మృతి చెందగా వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇక వైజాగ్లో విషవాయువు లీకైన ఘటనపై ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సంతాపం ప్రకటించిన రోజా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు .
గ్యాస్ లీక్ ఘటన .. ఎమ్మెల్యే రోజా, ఎంపీ విజయసాయి స్పందన.. సాయమందిస్తామన్న స్వామీ స్వరూపానంద
ఇక ఇదే సమయంలో విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన విషయంలో హై పవర్ కమిటీ వేసి దర్యాప్తు చేయిస్తున్న ఏపీ సర్కార్ పారదర్శకతను ఆమె కొనియాడారు. సీఎం జగన్ మంచి మనసున్న ముఖ్యమంత్రి అని అందుకే నిన్న విశాఖలో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించి వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారని రోజా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని చూసి అన్ని పార్టీలు అభినందిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక అంతే కాదు స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించి వారిలో ధైర్యం నింపారని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారని రోజా తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులున్నారని పేర్కొన్న రోజా ఆంధ్రప్రదేశ్కు మాత్రం మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారని, ఇంకే రాష్ట్రంలో ఇంతగా మంచి మనసున్న సీఎం లేరని పేర్కొన్నారు.
ప్రజల కష్టాలను చూసి జగన్ చలించిపోయారని ఎన్నడూలేని విధంగా రూ.కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారని చెప్పారు. ఇక అంతే కాదు ఈ ఘటనకు బాధ్యులు ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటారని , అందుకే కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు రోజా . ఇక టీడీపీ నేతలు దీనిపై కూడా చీప్గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోటి రూపాయల పరిహారం ఇస్తుంటే టీడీపీకి నోటిమాట లేదని ఏదేదో పనికిమాలిన విషయాల మీద రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు .యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. యాజమాన్యంపై కూడా ఇప్పటికే పోలీసు కేసు నమోదయ్యిందన్నారు. ఇక టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ విచారణ తూతూమంత్రంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .