మేనమామగా పిల్లలకు అండగా నిలుస్తా: ఇంగ్లీషు మీడియం తప్పదు..పరోక్ష సెటైర్లు: సీఎం జగన్..!
ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడిని చిత్తూరులో ప్రారంభించారు. ఈ పధకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు దాదాపు రూ 6,318 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. దీంతో సుమారుగా 82 లక్షల మంది పిల్లలకు లబ్ది కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు మాత్రమే ఈ పధకం అమలు చేస్తామని చెప్పినా..ఇప్పుడు ఇంటర్ వరకు అమలు చేస్తున్నామన్నారు. వచ్చే జూన్ నుండి ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామని..తెలుగు తప్పనిసరి చేసామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే..పరోక్షంగా సెటైర్లు వేసారు. ఇక, ఇంటర్ తరువాత కూడా పిల్లలు రాణించేలా పూర్తి ఫీజు రీయబంర్స్ మెంట్ అమలు చేస్తామన్నారు. విద్యార్ధులకు ఇచ్చే మెనూ గురించి కూడా ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి తానేనని చెప్పుకొచ్చారు. పాఠశాలల నాడు నేడులో తల్లి తండ్రులు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నెల రోజుల సమయం పొడిగింపు
పేదింటి తల్లులకు తమ బిడ్దలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. పేదల బిడ్దలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పధకం అమలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. పిల్లలకు బడికి పంపే ప్రతీ తల్లి బ్యాంకు ఖాతాలో ఏటా రూ 15 వేలు జమ అవుతాయని వివరించారు. ఈ నగదుకు బ్యాంకుల్లో గతంలో ఏవైనా అప్పులుంటే వాటికి జమ చేయవద్దని బ్యాంకులకు సూచించామని స్పష్టం చేసారు. ఈ ఏడాదికి హాజరు శాతం మినహాయించినా..వచ్చే ఏడాది నుండి ఖచ్చితంగా 75 శాతం హాజరు ఉండేలా చూసుకోవాలని సూచించారు. తొలి విడతలో పధకానికి ఎంపిక కాని లబ్ది దారుల కోసం నెల రోజుల సమయం పొడిగిస్తున్నామని వచ్చే నెల 9వ తేదీ లోగా లబ్దిదారులు నమోదు చేయించుకోచ్చని సీఎం జగన్ వివరించారు.
ఇంగ్లీషు మీడియం అమలు చేస్తాం..సెటైర్లు
మరోసారి ఇంగ్లీషు మీడియం గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. వచ్చే జూన్ నుండి ఒకటి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేసారు. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం కావాలా వద్దా మీరే చెప్పండి అంటూ సభకు హాజరైన వారి నుండి సమాధానం రాబట్టారు. మీరు గట్టిగా చెప్పాలని ..లేకుంటా వారి పిల్లలకు మాత్రమే ఇంగ్లీషు మీడియం కావాలని కోరుకొనే పత్రికాధిపతులకు..ప్రముఖ హీరోలకు..సీనియర్ రాజనీయ నేతలకు వినబడదని సైటైర్ వేసారు. వచ్చే ఏడాది నుండి ఒక్కో తరగతిలో ఇంగ్లీషు మీడియం పెంచుకుంటూ పోతామని..నాలుగేళ్ళల్లో పదో తరగతి పరీక్షలు ఇంగ్లీషులో రాసే పరిస్థితి వస్తుందన్నారు. ఇందు కోసం బ్రడ్జి కోర్సులు..ఉపాధ్యాయులకు శిక్షణా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అదే విధంగా బడుల్లో సిలబస్ సైతం మార్చేస్తున్నామన్నారు. ఇక, బడులు తెరిచే సమయానికే పుస్తకాలు...మూడు జతల బట్టలు..బెల్టు..బూట్లు..సాక్స్ కలిపి కిట్ గా అందిస్తామని ప్రకటించారు.
మెనూ గురించి ఆలోచించే ఏకైక సీఎంగా...
బడుల్లో ఇప్పటి వరకు మధ్నాహ్న భోజనంలో మార్పులు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ప్రతీ రోజు ఒకే మెనూ కాకుండా..రోజుకో రకం ఆహారం అందిస్తామని చెప్పారు. నాడు-నేడు పధకం ద్వారా రాష్ట్రంలోని బడులు..కాలేజీల రూపు రేఖలు మారుస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది నుండి మూడేళ్ల లోగా మార్పులు జరుగుతాయని వివరించారు. అదే విధంగా ఇంటర్ తరువాత విద్యార్దులు పై చదువుల శాతం కేవలం 23 గా మాత్రమే ఉందని..దీనిని పెంచటానికి పూర్తి స్థాయి ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు చేస్తామన్నారు. విద్యా దీవెన..విద్యా వసతి కింద ప్రతీ విద్యార్ధికి రూ 20 వేలు అందిస్తామని చెప్పారు. బడులను చదువు ల దేవాలయంగా మారుస్తామని ప్రకటించారు. పిల్లలకు మంచి మేనమామగా నిలుస్తానన్నారు. తన కోసం ప్రతీ తల్లి తమ బిడ్డలు చదివే పాఠశాలల్లో బాత్రూంలు..వాచ్ మెన్ కోసం ఈ రూ 15వేల నుండి వెయ్యి రూపాయాలు బడి కోసం ఖర్చు చేయాలని..పాఠశాలల మార్పులో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.