వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన వాయిదా: 25కు బదులుగా: ఇళ్ల పట్టాల పంపిణీ
చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన వాయిదా పడింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 25వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. దీనికోసం జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామాన్ని ఎంపిక చేశారు. అక్కడే ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టాల్సి ఉంది.
తాజాగా- వైఎస్ జగన్ పర్యటన మూడు రోజుల పాటు వాయిదా పడింది. ఈ నెల 25వ తేదీకి బదులుగా ఆయన 28వ తేదీ నాడు ఊరందూరుకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జిల్లా వరకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ అదేరోజు శ్రీకారం చుడతారని అంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆయన నిర్వహించ తలపెట్టిన చిత్తూరు జిల్లా పర్యటనను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఊరందూరు-చిందేపల్లి మధ్య ముఖ్యమంత్రి బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్థలాన్ని జిల్లాకు చెందిన మంత్రి జిల్లాకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. మొత్తం జిల్లాలో తొలివిడతలో అర్హులైన ఆరువేల మందికి ఇళ్ల పట్టాలను అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
23 నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి.. తన సొంత జిల్లాలో పర్యటించాల్సి ఉంది. 25వ తేదీన ఆయన కాకినాడలో ఇళ్ల పట్టాల పంపిణీని చేపడతారు. అనంతరం 28వ తేదీన చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రామన్ని కొనసాగిస్తారు. ఈ జిల్లాలో మొత్తం 15 వేల మందికి దశలవారీగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు. దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం తాజాగా 935 కోట్ల రూపాయల పాలనా అనుమతులను ఇచ్చింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం అవసరమైన భూమిని కొనుగోలు చేయడం, దానికి పరిహారం చెల్లింపుల ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంతో పాటు వాటిని నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.