చంద్రబాబు సొంత జిల్లాకు వైఎస్ జగన్: మలిదశ ఇళ్ల పట్టాల పంపిణీ అక్కడే: చేరికలకు ఛాన్స్?
చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. సోమవారం ఆయన పర్యటన కొనసాగనుంది. మలిదశ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. దీనికోసం శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామాన్ని ఎంపిక చేశారు. అక్కడే ఇళ్ల పట్టాల పంపిణీని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నిజానికి-తొలిదశలో ఇక్కడే ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ.. అది వాయిదా పడింది. ఊరందూరుకు బదులుగా తూర్పు గోదావరి జిల్లాను ఎంపిక చేశారు. యూ కొత్తపల్లి మండలం పరిధిలోని కొమరగిరిలో శుక్రవారం ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టారు.
ఊరందూరు వద్ద..
చంద్రబాబు సొంత జిల్లాలో మలిదశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఊరందూరు-చిందేపల్లి మధ్య ముఖ్యమంత్రి బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్థలాన్ని జిల్లాకు చెందిన మంత్రి జిల్లాకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా ఇదివరకే సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు.
రాజకీయ వేదికగా..
ముఖ్యమంత్రి బహిరంగ సభకు అక్కడ ఏర్పాట్లన్నీ సిద్ధం అయ్యాయి. జిల్లాలో తొలివిడతలో అర్హులైన ఆరువేల మందికి ఇళ్ల పట్టాలను అందించనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమం రాజకీయాలకు కేంద్రబిందువుగా మారే అవకాశాలు లేకపోలేదు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవచ్చని అంటున్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్..వైసీపీలో చేరతారనే ప్రచారం జిల్లాలో సాగుతోంది.
టీడీపీ నేతల చేరికకు ఛాన్స్?
ఇప్పటికే ఆయన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్లోనే మనోహర్ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తొలుత భారతీయ జనతా పార్టీలో చేరొచ్చనే వార్తలు వచ్చినప్పటికీ.. వాటిని ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ చేరదలచుకోలేదంటూ చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఓ సారి వైఎస్ జగన్ను కలిశారనే ప్రచారం సైతం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని చెబుతున్నారు.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారానికీ..
మరోవంక- తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంది. దీనికోసం ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో దింపింది. తెలుగుదేశం నుంచి కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి పోటీ చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మాజీ ఐఎఎస్ అధికారి దాసరి శ్రీనివాసులుకు టికెట్ ఇవ్వొచ్చిన సమాచారం. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ నిర్వహించ తల పెట్టిన పర్యటన.. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వేడిని రగిలించే అవకాశం ఉంది.