పెళ్లి పీటలు ఎక్కక ముందే.. డెంగీ కాటుకు పెళ్లికూతురు బలి
తెలుగు రాష్ట్రాల్లో డెంగీ మహామ్మారీకి అనేకమంది బలి అవుతున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణలో డెంగీకి ఓ కుటుంబం మొత్తం బలైన సంఘటన మరవక ముందే ఏపీలోని చిత్తూరు జిల్లాలో ముహుర్తానికి పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికూతురును డెంగీ మింగేసింది. నిండు నూరేళ్లు జీవించాలని కళలు కన్న యువతిని డెంగీ రూపంలో మృత్యువు కబలించింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
పెళ్లింట డెంగీ విషాదం
తన అందమైన భవిష్యత్పై కళలుకంటూ మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి డెంగీ భారిన పడింది. అనంతరం చికిత్సపోందుతూ అర్థంతరంగా తనువు చాలించింది. దీంతో పెళ్లి సందడితో నవ్వులు పూయాల్సిన ఇళ్లు విషన్న వదనలతో ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళితే...చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం టీవీఎన్ఆర్పురంలో నివాసం ఉంటున్న క్రిష్ణం రాజు, రెడ్డమ్మల కూతురు చంద్రకళకు అక్టోబర్ 30న పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు, కుటుంబసభ్యులతో ఇళ్లు సందడిగా మారింది. అయితే ఇదే సందర్భంలో పెళ్లికూతురు చంద్రకళ అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆమేకు డెంగీకి సంబంధించిన లక్షణాలు బయటపడ్డాయి.
డెంగీతో పెళ్లి వాయిదా
ఈనేపథ్యంలోనే చంద్రకళకు మెరుగైన చికిత్స అందించడం కోసం జిల్లాలోని వేలూరు ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఇంటికి బంధువులు అందరు ఇంటికి వచ్చిన నేపథ్యంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రకళకు పెళ్లి చేయాలని భావించారు. కాని ఆమే ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో 30వ తేదిన జరగాల్సిన పెళ్లిని సైతం వాయిదా వేశారు. దీంతో గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న చంద్రకళ నేడు ఉదయం మృత్యుఒడిలోకి చేరింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
రెండు రాష్ట్రాల్లో తీవ్రమైన డెంగీ
చిత్తూరు జిల్లాలో ఇటివల డెంగీ మరణాల సంఖ్య పెరుగుతోంది. డెంగీతో ఇప్పటికే జిల్లాలో పదిమంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగారు. స్థానిక గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై ఆయన స్యయంగా పర్యవేక్షణ చేపట్టారు. పారిశుద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రాంతాల్లో సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధికారుల చర్యలు మాత్రం ఫలితాలను ఇస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. బదులుగా డెంగీ కోరలు విప్పుతుంది. ఇక ఇటివల తెలంగాణలో సైతం డెంగీ విజృంభిస్తోంది. దీంతో నివారణ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే..