రేణిగుంట ఎయిర్పోర్టులో చంద్రబాబు నిర్బంధం: ఎయిర్ పోర్ట్ లో బాబు నిరసన,ఉద్రిక్తత
టిడిపి అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగుతోంది. నేడు చంద్రబాబు చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలో ఐదు వేల మంది కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న నేపద్యంలో, పోలీసులు చంద్రబాబు నిర్వహించే ధర్నాకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు టిడిపి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు లు చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చిత్తూరు పర్యటనకు అనుమతి నో .. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నిర్బంధం
ఇదే సమయంలో టిడిపి నిర్వహించ తలపెట్టిన ఆందోళన కోసం అధినేత చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు నిలువరించారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదని చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ లోనే నిర్బంధించారు . ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు, పోలీసులు చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి లేదని చెప్పడంతో గంటకు పైగా ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయారు.
ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు ఆందోళన
ఎంతకీ చంద్రబాబును బయటకు వెళ్ళడానికి అనుమతించకపోవడంతో అక్కడే నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసనకు దిగారు. మరోవైపు టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించి చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు . చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్టు తమకు తెలియదని ఆ నోటీసులో పేర్కొన్నారు.
చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలని టీడీపీ ఆందోళన .. పలువురు అరెస్ట్
అంతేకాదు చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక భారీగా ఎయిర్ పోర్టుకు చేరుకున్న టిడిపి కార్యకర్తలు చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు టిడిపి కార్యకర్తలను ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు.