నగరిలో ఏం జరుగుతోంది.. ఎమ్మెల్యే రోజా వర్గం మీద వేటు.. కారణం అదే అంటున్న జిల్లా నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. చిత్తూరు జిల్లా అనగానే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎమ్యెల్యే రోజా గుర్తుకు రావడం సహజం. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. నగరి మున్సిపల్ కమీషనర్ సస్పండ్ అంశం సంచలనంగా మారింది. కమీషనర్ వెంకట్రామి రెడ్డి సెల్ఫీ వీడియో సారాంశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ ఆయనపై వైసీపీ ప్రభుత్వం వేటు వేసినట్టు తెలుస్తోంది. కాగా సస్పెండ్ అయిన వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్యే రోజాకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు వేయొదందని రోజా అదిష్టానానికి విజ్ఞప్తి చేసినప్పటికి జిల్లా నేతల ఒత్తిడితో వేటు తప్పలేదని తెలుస్తోంది.
కొంప ముంచిన కరోనా.. నగరి మున్సిపల్ కమీషనర్ పై వేటు..
చిత్తూరు జిల్లాలో అధికార వైసీపి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నేతల మధ్య సఖ్యత ఉన్నట్టు పైకి కనిపించినా లోలోపల మాత్రం ఆదిపత్యపోరు తారా స్దాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నగరి నియోజక వర్గంలో రాజకీయాలు తరచూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. సొంత పార్టీ నేతల మద్యనే తీవ్ర ఆదిపత్య పోరు నెలకొంటుందనే చర్చ కూడా జరుగుతుంటుంది. ఇక నగరి నియోజక వర్గంలో ఎమ్మెల్యే రోజా ఏక పక్షంగా వ్యవహరిస్తుందని, సీనియర్ నాయకులను పట్టించుకోకుండా అదికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో రోజా మీద సీఎం జగన్మోహన్ రెడ్డికి జిల్లా నేతలు అనేక ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. మంత్రి పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డికి సైతం రోజా తో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.
రోజాను ఏకాకిని చేసే ప్రయత్నాలు.. చిత్తూరు వేసిపి నేతల్లో విభేదాలు..
ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి రెడ్డి వారి చెంగారెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రోజాకు ప్రత్యామ్నాయంగా ఆయన కార్యక్రమాలను చేస్తున్నట్లు నియోజక వర్గంలో పేరు సంపాదించారు. 2019 సాధారణ ఎన్నికల ముందు కూడా ఆయన చాలా చురుగ్గా పనిచేసినట్టు పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో రోజా చక్రపాణి రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తుందని చక్రపాణి వర్గం ఆగ్రహంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో రోజా అనుచరుడు, నగరి మున్సిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డి వేటు సంచలనంగా మారింది. రోజాను ఒంటరి చేసేందుకే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
కరోనా కష్టకాలంలోనూ దూసుకెళ్తున్న రోజా.. కళ్లెం వేసేందుకు అధిష్టానంపై ఒత్తిడి..
2019 సాదారణ ఎన్నికల ముందు నగరి టికెట్ అంశంలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో రోజా కాకుండా చక్రపాణి రెడ్డికి సీటు కేటాయిస్తారనే చర్చ కూడా జరిగింది. కాని చివరి నిమిషంలో రోజా సీటు సాధించుకుని గెలిచారు. గెలిచిన తర్వాత రోజాకు హోం మినిష్టర్ పదవి ఖాయమని ఏపి లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాని సీఎం జగన్మోహన్ రెడ్డి రోజాను మంత్రి వర్గంలోకి తీసుకునే అంశానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. మంత్రివర్గం కొలువు దీరిన తర్వాత చాలా రోజులకు రోజాకు నామినేటెడ్ పదవి కట్టాబెట్టారు జగన్. దీని వెనక కూడా చిత్తూరు జిల్లా నేతల జోక్యం ఉన్నట్టు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
Recommended Video
రోజా దూకుడుకు చెక్.. సీఎం జగన్ కు ఫిర్యాదుల వెల్లువ..
ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా స్పీడుకు బ్రేకులు వేసే పనిలో భాగంగానే ఆమె అనుచరుడు నగరి మున్సిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డి పై వేటు పడినట్టు తెలుస్తోంది. చిన్న మందలింపుతో సరిపోయే అంశాన్ని వేటు దాకా తీసుకొచ్చారని, దీని వెనక జిల్లా నేతల ఒత్తిడి ఉందనే చర్చ కూడా జరుగుతోంది. కరోనా వైరస్ అంశంలో ప్రభుత్వ చర్యలు, నిరుపేదలకు భోజనాలు, ముందస్తు జాగ్రత్తలు, ఆర్ధిక సాయం తదితర అంశాల్లో జిల్లా నేతలకు ఎమ్మెల్యే రోజా తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుంటుందని జిల్లా నేతలు ఆగ్రహంగా ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో నగరి మున్సిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డి చేసిన వీడియో ఆరోపణలను ఆసరా చేసుకుని రోజాను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నట్టు జిల్లాలో చర్చ జరుగుతోంది.