నిన్న కాడెడ్లుగా కుమార్తెలు..నేడు ట్రాక్టర్: రాత్రికి రాత్రి మారిన చిత్తూరు రైతు తల రాత
మదనపల్లి: చిత్తూరు రైతు నాగేశ్వర రావు పేరు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక్క వీడియోతో ఆయన రాష్ట్ర ప్రజలకు పరిచుతులయ్యారు. వ్యవసాయ పనులను కొనసాగించడానికి అవసరమైన పరికరాలను గానీ, ఎద్దులను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల తన ఇద్దరు కుమార్తెలను కాడెద్దులుగా మార్చి పొలాన్ని దున్నిన వీడియో వెలుగులోకి రావడం, దాన్ని చూసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆయనకు ట్రాక్టర్ను కొనివ్వడం వంటి సంఘటనలు చకచకా చోటు చేసుకున్నాయి.
Recommended Video
సోనూసూద్ దాతృత్వానికి నెటిజన్లు ఆయనకు జైకొడుతున్నారు. విలన్ క్యారెక్టర్లలో నటించినా.. రియల్ హీరో అనిపించుకున్నారంటూ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. సోనూసూద్ ట్రాక్టర్ను పంపించారు. మధ్యాహ్నం మాట వచ్చిన సోనూసూద్.. సాయంత్రానికి సొనాలికా ట్రాక్టర్ను చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని కేవీ పల్లి మండలం మహల్ రాజపల్లికి చెందిన నాగేశ్వర రావు ఇంటి ముందు నిలబెట్టారు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
ట్రాక్టర్ చేతికి అందడంతో నాగేశ్వర రావు ఇక దానితోనే పొలాన్ని దున్నారు. ఈ ఉదయం తన భార్య, ఇద్దరు కుమార్తెలతో ఇంటి నుంచి పొలానికి ట్రాక్టర్ మీదే బయలుదేరి వెళ్లారు. డ్రైవర్ సహాయంతో పొలాన్ని దున్నారు. విత్తనాలను చల్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా, సోనూసోద్ చేసిన సహాయం పట్ల రైతు నాగేశ్వర రావు ఆయనకు కృతజ్ఙతలు తెలిపారు. తనకు ఏ మాత్రం పరిచయం లేని ఓ వ్యక్తి ఆదుకోవడానికి ముందుకు రావడం ఆయనలోని మానవత్వాన్ని చాటుతోందని అన్నారు.
తనకు రెండెకరాల పొలం ఉందని, వ్యవసాయాన్ని కొనసాగించడానికి అవసరమైన పనిముట్లు గానీ, ఇతర సౌకర్యలు లేకపోవడం వల్ల అర ఎకరంలో మాత్రమే నాట్లు వేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. సోనూసూద్ వల్ల ట్రాక్టర్ చేతికి వచ్చిందని, ఇక రెండెకరాల పొలాన్ని దుక్కి దున్నుతానని చెప్పారు. తనకు మళ్లీ మదనపల్లికి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పొలం పనులను చేసుకుంటూ స్వగ్రామంలోనే స్థిరపడతానని అన్నారు. సోనూసూద్ తన కుటుంబాన్ని ఆదుకున్నారని, ఆయన సహాయాన్ని జీవితంలో మరిచిపోలేనని నాగేశ్వరరావు చెప్పారు.