టిక్టాక్ చిట్కాలతో ప్రాణాలమీదకు : ఆ రసం తాగితే కరోనా కాటేయదా..? జాగ్రత్త..!
చిత్తూరు: అసలే కరోనావైరస్ విజృంభిస్తుంటే సోషల్ మీడియా వేదికగా ఇవి చేస్తే కరోనా రాదు.. అవి చేస్తే కరోనా రాదు అంటూ ఏకంగా చిట్కాలే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ చిట్కాల్లో ఎంత వరకు నిజమనేదీ పక్కాగా తెలియకున్నప్పటికీ.. వీటిని ఈ సమయంలో ఫాలో కావడం ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా చిత్తూరులో కూడా కరోనావైరస్ రాకుండా చేయాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటించాలంటూ వచ్చిన టిక్టాక్ వీడియోను ఫాలో అయి రెండు కుటుంబాలు ఇబ్బందుల్లో పడిపోయాయి.
కరోనావైరస్ గురించి సోషల్ మీడియా వేదికగా వస్తున్న వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నప్పటికీ కొందరు మాత్రం ప్రభుత్వాల మాట పెడచెవినపెట్టి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. టిక్టాక్ వేదికగా కరోనావైరస్కు ఇంటిచిట్కాలు అంటూ ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఫాలో అయిన రెండు కుటుంబాల సభ్యులు ఏకంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బైరెడ్డిపల్లె మండలం ఆలపల్లి గ్రామంలో నివసించే రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు ఉమ్మెత్తకాయకు చెందిన విత్తనాలతో జ్యూస్ తాగారు. ఇది తాగితే కరోనావైరస్ దరిచేరదంటూ టిక్టాక్ వీడియోలు చక్కర్లు కొట్టడంతో ఇది నిజమే అని నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు రెండు కుటుంబాలకు చెందిన 10 మంది.
ఉమ్మెత్తకాయ జ్యూస్ తాగగానే అనారోగ్యపాలైనట్లు బైరెడ్డిపల్లె ఎస్ఐ మునిస్వామి చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గమనించిన పొరుగింటివారు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే వారికి చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితి నుంచి వారు బయటపడినట్లు వైద్యులు చెప్పారు. కరోనావైరస్కు ఇంటి చిట్కాలు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు చూసి మోసపోవద్దని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు చిత్తూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పెంచలయ్య. వైద్య నిపుణులు ధృవీకరిస్తేనే ఏదైనా తీసుకోవాలని సూచించారు. కోవిడ్-19ను జయించే వ్యాక్సిన్ ప్రస్తుతానికి అయితే లేదని వివరించారు. ఇళ్లకే పరిమితమై ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరారు. ఆరోగ్యశాఖ సూచించిన జాగ్రత్తలను పాటించాల్సిందిగా చెప్పారు.
ఇక నాటు సారా కూడా కరోనాకు విరుగుడులా పనిచేస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వాటిని తయారు చేసే వారు అమాంతంగా ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారని డాక్టర్ పెంచలయ్య చెప్పారు. ప్రజలు కూడా నాటుసారా కోసం ఎగబడుతుండటంతో ధరలు పెంచి అమ్ముతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని జిల్లా ఆరోగ్యశాఖాధికారి చెప్పారు. కరోనాకు నాటుసార విరుగుడుగా పనిచేస్తుందనే అంశంలో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు.