కుప్పం గ్రౌండ్ రిపోర్ట్: సొంత నియోజకవర్గంలో చంద్రబాబు: క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మూడు రోజుల కుప్పం పర్యటన ఆరంభమైంది. కొద్దిసేపటి కిందటే ఆయన కుప్పం చేరుకున్నారు. ఈ ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరిన ఆయన రోడ్డు మార్గంలో కుప్పానికి వచ్చారు. సుమారు 14 నెలల తరువాత చంద్రబాబు.. కుప్పం పర్యటనకు రావడం ఇదే తొలిసారి. కుప్పం పట్టణానికి అయిదు కిలోమీటర్ల దూరం నుంచే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా చంద్రబాబు జిందాబాద్ అంటూ నినదించారు.
అన్నీ అపశకునాలే: ప్రతికూల పరిస్థితుల మధ్య సొంత నియోజకవర్గానికి చంద్రబాబు
వరుస భేటీలతో బిజీబిజీగా..
మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల దారుణ పరాజయాలు, వ్యక్తిగత సహాయకుడు మనోహర్ రాజీనామా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా వేళ్లూనుకోవడం వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఆయన తన సొంత నియోజకవర్గానికి చేరుకున్నారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలను నిర్వహించనున్నారు. మండల స్థాయి నాయకులతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, నెలకొన్న పరిస్థితుల గురించి ఆరా తీయనున్నారు. గుడుపల్లి మండలం టీడీపీ నేతలతో ఆయన సమీక్షా సమావేశాలు ఆరంభం కానున్నాయి.
జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో
జిల్లా పరిషత్, మండల పరిషత్ మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నందున.. పంచాయతీల్లో చవి చూసిన ఓటమిని పునరావృతం కాకుండా చంద్రబాబు కాయకల్ప చికిత్సకు పూనుకుంటోన్నారు. ప్రజల్లో పార్టీ పట్ల తలెత్తిన వ్యతిరేక భావాన్ని ఈ స్థాయిలో తుడిచి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న నేతలపై చంద్రబాబు వేటు వేసే అవకాశాలు లేకపోలేదు. స్థానిక నేతల్లో పేరుకుపోయిన నియంతృత్వ పోకడలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల ఇళ్ల వద్దకే అందుతోండటం వంటి పరిణామాలు టీడీపీపై వ్యతిరేకతను కలిగిస్తోన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
తిరోగమనానికి కారణాలేంటీ?
స్థానిక నేతలు చేస్తోన్న తప్పులు పార్టీ తిరోగమనానికి దారి తీస్తోన్నాయని టీడీపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. దాని ఫలితమే పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి కారణైందని విశ్లేషిస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు స్వయంగా కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినప్పటికీ.. ఫలితాలు మాత్రం బెడిసి కొట్టాయి. పూర్తిగా నిరాశ పరిచాయి. చంద్రబాబు చేసిన సూచనలను స్థానిక నాయకులు పకడ్బందీగా అమలు చేయలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న వారి గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ- ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొందరు నాయకులు కుండబద్దలు కొడుతున్నారు.
ప్రక్షాళన తప్పకపోవచ్చు..?
అలాంటి నాయకులపై వేటు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోన్నాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజినామాలు చేయడం వల్ల చంద్రబాబు నుంచి సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆవిర్భావం నుంచీ టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న కుప్పం నియోజక వర్గంలో పునాదులు కదిలి పోయేంతటి పరిస్థితి ఎందుకు నెలకొందనే విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడానికి కూడా స్థానిక నాయకులు భయపడుతున్నారనే వాదనలు లేకపోలేదు. దాదాపు పూర్తిస్థాయి కుప్పం నియోజకవర్గంలో పార్టీని ప్రక్షాళన చేస్తారని సమాచారం.