రోజాకు జగన్ పిలుపు: బుజ్జగింపులేనా..పదవి ఇస్తారా: సీఎం ఇచ్చే ఆఫర్ ఇదేనా..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ముఖ్యమంత్రి జగన్ నుండి పిలుపు వచ్చింది. మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడ్డ రోజా కేబినెట్ విస్తరణకు హాజరు కాకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. తన అసంతృప్తిని జిల్లా ఎమ్మెల్యేలతో రోజా షేర చేసు కున్నారు. వారు రోజా ఆవేదనను పార్టీ అధినేత .. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో..జగన్ హైదరాబాద్లో ఉన్న రోజాను తన వద్దకు రావాలని సూచించారు. ఆ వెంటనే రోజా హైదరాబాద్ నుండి అమరావతికి బయల్దేరారు. ఇక, ఇప్పుడు జగన తన వద్దకు వచ్చిన రోజాకు ఏం చెప్పబోతున్నారు. బుజ్జగింపులకే పరిమితం అవుతారా..లేక నామినేటెడ్ పదవి కట్టబెడతారా అనేది ఆసక్తి కరంగా మారింది. ఇంతకీ ఏ పదవి ఇవ్వబోతున్నారు..
అమరావతికి రోజా..జగనతో భేటీ..
వైసీపీ అధికారంలోకి వచ్చినా రోజాకు మంత్రి పదవి దక్కలేదు. నగరి నుండి వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా..వైసీపీ అధికారంలోకి రావటంతో జగన్ ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశించారు. అయితే, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి..ఎస్సీ వర్గానికి చెందిన నారాయణ స్వామికి జగన్ కేబినెట్లో బెర్తులు దక్కాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి దక్కటంతో..అదే వర్గానికి చెందిన రోజాకు ఇక అదే జిల్లా నుండి మంత్రి దక్కలేదు. దీంతో..చాలా ఆశలు పెట్టుకున్న రోజా జగన్ సచివాలంలోకి ప్రవేశం.. కేబినెట్ విస్తరణకు ముందుగానే అమరావతి నుండి హైదరాబాద్ వెళ్లిపోయారు. రెండు రోజులుగా రోజా పార్టీ నేతలతో టచ్లో లేరు. ఇదే సమయంలో బుధవారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో తన వద్దకు రావాలని రోజాకు జగన్ కార్యాలయం నుండి సమాచారం అందటంతో హైదరాబాద్ నుండి అమరావతికి బయల్దేరారు.
బుజ్జగింపులా..పదవులా..
రోజా తనకు మంత్రి పదవి రాకపోవటంతో తనకు సన్నిహితంగా ఉండే నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో వారు ఈ విషయాన్ని జగన్కు వివరించారు. ఇప్పుడు తన వద్దకు రోజాను పిలిపించిన జగన్ కేవలం బుజ్జగించి రెండో విడతలో మంత్రి పదవి ఇస్తానని హమీ ఇస్తారా..లేక ప్రస్తుతం నామినేటెడ్ పదవి ఇస్తారా అనే ఆసక్తి నెలకొని ఉంది. ఇందులో భాగంగా..ఇప్పటికే జగన్ సైతం నామినేటెడ్ పదవుల భర్తీ పైన దృష్టి సారించారు. రోజా సహచర ఎమ్మెల్యే అయిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి విప్ పదవితో పాటుగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ పదవి కేటాయించారు. ఇక, ఇప్పుడు రోజా ముందు ముఖ్యమంత్రి జగన్ మూడు కీలక పదవుల్లో ఏదో ఒకటి రోజా కోరుకున్న విధంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా..బుధవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గతంలో సభ నుండి బహిష్కరణకు గురైన రోజా..వైసీపీ ప్రభుత్వంలో తొలి రోజు నుండే సభలో ఉండాలని జగన్ చూచించే అవకాశం ఉంది.
రోజాకు ఇవే జగన్ ఆఫర్లు...
మంత్రి పదవి ఇవ్వలేకపోయినా..నామినేటెడ్ పదవి ద్వారా రోజాకు తగిన గుర్తింపు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా..రోజా కోసం మూడు పదవులను జగన్ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో మహిళా కమీషన్ ఛైర్ పర్సన్...ఆర్టీసీ ఛైర్ పర్సన్.. రాయలసీమ అభివృద్ది కమిటీ చైర్మన్ ఈ మూడు పదవుల్లో రోజాకు ఒక పదవి ఆఫర్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో టీడీపీలో..ఇప్పుడు వైసీపలో మహిళా విభాగం అధ్యక్షురాలిగా రోజా అప్పుడూ..ఇప్పుడూ పని చేస్తున్నారు. మహిళల ప్రతినిధిగా రోజా బలమైన వాయిస్ వినిపిస్తూ వచ్చారు. దీంతో.. ఏపీ మహిళల ప్రతినిధిగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా రోజాను నియమించటం దాదాపు ఖాయంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్తో చర్చల సమయంలో ఈ విషయాన్ని రోజాకు వివరించి..జగన్ అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.