coronavirus: శ్రీకాళహస్తిశ్వరుడికి తాకిన వైరస్, చిన్నపిల్లలు, వృద్ధులకు నో ఎంట్రీ..
కరోనా వైరస్ రక్కసి జడలు విప్పి నాట్యం చేస్తోంది. నగరాల నుంచి మారుమూల పల్లెలకు సోకుతోంది. ఎక్కువమంది గుమిగూడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రముఖ ఆలయం షిరిడీలో మంగళవారం నుంచి దర్శనాలు నిలిపివేశారు. ఇటు ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో ఆంక్షలతో కూడిన దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు దేవాలయానికి రావొద్దని ఆలయ అధికారులు కోరారు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు చనిపోయిన ముగ్గురు కూడా వృద్ధులే. చిన్న పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సజెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి ఆలయ అధికారులు కూడా వృద్ధులు, పిల్లలు దర్శనం కోసం రావొద్దని సూచించారు. 12 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు ఆలయానికి రావొద్దని ప్రత్యేకంగా కోరారు.
వృద్ధులు, చిన్నారులు సహా ఆలయంలో చేసే పూజల కోసం చెల్లించిన సేవలను రద్దుచేస్తున్నామని ప్రకటించారు. ఆయా సేవలకు సంబంధించి కట్టిన నగదు కూడా వెనక్కి ఇస్తామని ప్రకటించారు. ఆలయంలో కేవలం లఘు దర్శనం మాత్రమే అందుబాటులో ఉందని వివరించారు. అదీ కూడా పిల్లలు, వృద్ధులు కానీవారు మాత్రమే శ్రీ కాళహస్తిశ్వరుడిని దర్శించుకోవాలని సూచించారు.