ఆవు నోట్లో నాటుబాంబు పేలిన ఘటనలో ... మూడురోజుల నరకం చూసి గోమాత మృతి
కొద్దిరోజుల క్రితం కేరళలో ఏనుగు నోట్లో బాంబు పేలుడు ఘటన మరిచిపోకముందే మూడు రోజుల క్రితం ఏపీలో ఒక ఆవు నోట్లో నాటుబాంబు పేలడంతో నరకయాతన అనుభవించిన ఆవు ఈ రోజు మృతి చెందింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కొగిలేరు గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మూడు రోజులుగా వైద్యం అందిస్తునా సరే మృత్యువుతో పోరాడిన గోమాత చివరకు ప్రాణాలు విడిచింది.
మనుషుల రాక్షస ప్రవృత్తి రోజురోజుకూ పెరిగిపోతోందని చెప్పడానికి ఈ ఘటన తాజా ఉదాహరణ. చిత్తూరు జిల్లాలో వేటగాళ్ళు పెట్టిన నాటుబాంబును మేత కోసం వెళ్ళి కొరికిన ఆవు బాంబు పేలడంతో తీవ్ర గాయాలపాలైంది. మేత కోసం శ్రీకృష్ణ గోమాత పీఠానికి దగ్గరగా ఉన్న అడవికి వెళ్ళిన ఆవు ఒక పండులో పెట్టిన బాంబును కొరికింది. దీంతో బాంబు పేలడంతో ఆవు నోటి భాగమంతా చిద్రమైంది. దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన పశు వైద్యుడు కి సమాచారం అందించగా మూడు రోజుల నుండి ఆవుకు వైద్య చికిత్స అందిస్తున్నారు. నోటి నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో మూడు రోజులుగా చిత్రహింస అనుభవించిన ఆవు చివరకు ప్రాణాలను కోల్పోయింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి ఘటనకు కారకులైన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు స్మగ్లర్లు, మరో ముగ్గురు నాటుబాంబులు పెట్టిన వేటగాళ్లు గా పోలీసులు గుర్తించారు. కొగిలేరు దగ్గర సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న శ్రీకృష్ణ గోమాత పీఠానికి చెందిన ఆవుగా గుర్తించారు. అయితే జంతు ప్రేమికులు పశువులు తిరిగే స్థలాలలో బాంబులు పెట్టడం వంటివి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.