ఏపీలో దొంగ నోట్ల కలకలం, కుప్పంలో భారీగా పట్టివేత.. తిరుపతిలో కూడా చెలామణీ..?
చిత్తూరు : నకిలీ నోట్ల బెడద తప్పడం లేదు. విదేశాల గుండా వస్తోన్న నకిలీ నోట్ల కట్టలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో నకిలీ నోట్లు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. తమ కమీషన్ కోసం దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యేందుకు పాటుపడుతున్నారు కొందరు కేటుగాళ్లు. తమ చైన్ విస్తరించుకొని .. కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఏపీలోని చిత్తూరులో నకిలీ నోట్లు భారీగా పట్టుబడ్డాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇటీవల దొంగనోట్ల చెలామణీ జోరుగా జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. పుణ్యక్షేత్రం కావడంతో నకిలీ నోట్ల సర్కులేషన్ కూడా ఈజీగా భావించి .. సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కుప్పం మండలం సామగుట్టపల్లిలోని ఓ ఇంట్లో నకిలీ నోట్ల చలామణి జరుగుతుంది. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన ఇద్దరు, కుపం మండలం సామగుట్టపల్లికి చెందిన ఇంటి యాజమాని ఈ నకిలీ నోట్ల చలామణీలోకి కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు తిరుపతికి చెందిన మరో ముగ్గురు కూడా ఉన్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. 2 కోట్ల 70 లక్షల 22 వేల నకిలీ నోట్లు పట్టుబడటంతో పోలీసులు విస్తుపోయారు. లక్ష రూపాయల నకిలీ నోట్లు చలామణీ చేస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఆకర్షించి .. నోట్లను యథేచ్చగా సర్కులేట్ చేయిస్తున్నారు. అయితే వీరు పెద్ద నోట్ల రద్దు చేసినప్పటి నుంచి నకిలీ నోట్లను చలామణీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
బుధవారం పట్టుబడిన నగదులో పాత వెయ్యి నోట్లు కూడా ఆందోళన కలిగిస్తోంది. వీటిపాటు రూ.2 వేల నోటు, రూ.500 నోట్లు కూడా ఉన్నాయి. అయితే పాత వెయ్యి నోట్లు కూడా చలామణీ చేస్తున్నారా ? అసలు ఇప్పుడు ఎక్కడివి ? గతంలోనివా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై ఆ ఆరుగురిని విచారిస్తే నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు.