చిత్తూరు కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం..అనుమానాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్ధం అయ్యాయి. కలెక్టర్ కార్యాలయం కొనసాగుతున్న వివేకానంద భవన్ లో బుధవారం అర్ధ రాత్రి దాటినా తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలింగ్ను ఇక్కడినుంచే పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడానికి ఈ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన హాలులోనే ప్రమాదం సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. భారీ ఎల్ఈడీ స్క్రీను సహా 112 ల్యాప్టాప్లు మంటల్లో కాలి పోయాయి.
అధికారుల సౌకర్యం కోసం ఇదే గదిలో పది వరకు ఏసీలు, 30 పైనే ఫ్యాన్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచారు. మంటలు చెలరేగడంతో అవి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలు అదుపు చేశాయి.