చిత్తూరులో విషాదం.. అంత్యక్రియలకు వెళ్తూ ఐదుగురు మృతి...
చిత్తూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలకడ-పీలేరు రహదారిలో ఆటో-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులను వెంకటరమణ, పార్వతమ్మ, సుగుణమ్మ, రెడ్డి గోవర్దిని, దామోదరంగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది.
కలకడ మండలం కొత్త గాండ్ల పల్లి గ్రామస్తులుగా వీరిని గుర్తించారు. ఓ బంధువు అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందగానే హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో సమీప ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గురువారం(జూలై 2) గుంటూరులో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తిమ్మాపురం గ్రామ సమీపంలో ఓ కంటైనర్ కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను అతులూరి బలరాం(26),షేక్ ఫిరోజ్ అహ్మద్(35),వింజమూరి హరికృష్ణ(27),మేడసాని వెంకట శ్రీ చందు(25)గా గుర్తించారు.