వెంటిలేటర్ పై చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్: చెన్నై వెళ్లనున్న చంద్రబాబు
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబైని చుట్టబెట్టిన మరో ఉత్పాతం: నగర వ్యాప్తంగా గ్యాస్ వాసన: కంటి మీద కునుకు లేకుండా!
తీవ్ర అస్వస్థతకు గురైన. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. 24 గంటల తరువాత కూడా ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదని చెబుతున్నారు. శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలియడంతో.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాస్సేపట్లో చెన్నై వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు శివప్రసాద్ కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
శివప్రసాద్ కొద్దిరోజులుగా మూత్ర పిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇటీవలే ఆయనకు చెన్నైలో చికిత్స చేయించారు. సుమారు రెండు వారాల పాటు ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా మరోసారి మూత్ర పిండాల్లో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీనితో కుటుంబ సభ్యులు ఆయనను గురువారం ఉదయం మరోసారి చెన్నై ఆసుపత్రికే తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు డాక్టర్లు వెల్లడించినట్లు కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు శివప్రసాద్ కుటుంబీకులకు ఫోన్ చేశారు. అధైర్య పడొద్దని అన్నారు. శివప్రసాద్ ను పరామర్శించడానికి తాను వస్తానని భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి చంద్రబాబు చెన్నైకి వెళ్లొచ్చని తెలుస్తోంది. చంద్రబాబుకు శివప్రసాద్ అత్యంత ఆప్తుడు. ఇద్దరిదీ ఒకే జిల్లా. చంద్రబాబు ప్రోత్సాహంతోనే శివప్రసాద్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారని జిల్లావాసులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా లోక్ సభ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో శివప్రసాద్ ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డెప్ప రెడ్డిపై పోటీ చేసిన శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.