బస్తీ మే సవాల్: రమేశ్, చంద్రబాబు పోటీచేసి గెలవండి, గెలిస్తే రాజీనామా చేస్తా, మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల వాయిదా జ్వాల ఎగిసిపడుతోంది. ఈసీ టార్గెట్గా విమర్శల జడివాన కొనసాగుతోంది. స్వేచ్ఛ పేరుతో తనకున్న హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లక్ష్యంగా విమర్శలు కొనసాగుతోన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసీ రమేశ్ కుమార్ తీరుపై మండిపడ్డారు. రమేశ్తోపాటు చంద్రబాబు నాయుడుకు సవాల్ కూడా విసిరారు.
బస్తీ మే సవాల్..
ఏపీలో ఎన్నికల వాయిదా వేయడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఈసీ రమేశ్ కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. వారిలో ఒకరు గెలిచినా.. తాను మంత్రి పదవీకి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. లేదంటే వారు పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో లేని వైరస్ ఉందని చెప్పి.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రమేశ్ కుమార్కు సిగ్గుంటే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బదిలీలు చేయం..
ఎన్నికలను వాయిదావేయడంతోపాటు చేసిన బదిలీలను అమలు చేయబోమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు నివేదికలతో చేసిన బదిలీలను ప్రభుత్వం అమలు చేయబోదని స్పష్టంచేశారు. ఈసీని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అసలే అప్పుల్లో ఉన్న ఏపీని మరింత కుంగదీసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయడంతో దాదాపు రూ.5200 కోట్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని.. పార్టీ ఉనికి కోల్పోతున్నందున ఎన్నికలను వాయిదా వేసేందుకు కరోనా వైరస్ను చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
Recommended Video
నోటిఫికేషన్ ఇవ్వకుండానే..
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడమే గాక.. అబద్దాలు వల్లిస్తున్నారని చంద్రబాబు నాయుడపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో లోకల్ బాడీ ఎన్నికలను నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తుచేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని.. కోడిగుడ్డుకు బోడి గుండుకు లింకు పెట్టడంలో చంద్రబాబును మించినవారు ఎవరూ లేరని దుయ్యబట్టారు. తన ఎల్లో మీడియాతో అసత్యాలను ప్రచారం చేసి.. లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.. 3 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని మండిపడ్డారు.