నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ ఇచ్చిన జగన్ ..ప్రత్యర్థి వర్గానికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి
ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణికి నియోజకవర్గంలో తలనొప్పి తప్పటం లేదు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లలో పలువురు బీసీ నేతలకు పదవులు దక్కుతున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ పదవులు ఖరారు చేసినట్లుగా సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమించేందుకు సిద్ధమైన ప్రభుత్వం అందులో భాగంగా కార్పొరేషన్ చైర్ పర్సన్ గా కేజే శాంతికి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ పరిణామం రోజా అనుచరులకు మింగుడు పడడం లేదని సమాచారం.
లోకేష్ అడ్డంగా దొరికారన్న రోజా .. చంద్రబాబు , లోకేష్ ల స్కామ్స్ పై సీబీఐ విచారణకు డిమాండ్
ఎమ్మెల్యే రోజా, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ ల మధ్య ఆధిపత్య పోరు
గత కొంత కాలంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా కు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య నగరిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజా కి వ్యతిరేకంగా వారి పనిచేశారని, అప్పటినుండి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో కేజే అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారు . ఆందోళనలు చేశారు . కె బిఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజ కి వెళ్ళిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా ఓ వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు . అప్పుడు రోజా సొంత పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గ కార్యకర్తలపై ఫిర్యాదు కూడా చేశారు .
రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ చైర్మన్ గా కేజే శాంతి నియామకం ... రోజాకు ఆగ్రహం
ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ గా కేజే కుమార్ భార్య శాంతి నియమితులు కావడం రోజాకు ఏమాత్రం నచ్చటం లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో కె జె కుటుంబానికి ఈ అవకాశం దక్కినట్లు గా ప్రచారం జరుగుతోంది. కేజే వర్గానికి పదవి లభించడంతో రోజా అనుచరవర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక కేజే కుమార్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కె జె కుమార్ వైసిపి ప్రారంభం నుండి జగన్ వెంట నడుస్తున్నారు. పార్టీలో , స్థానికంగా కేజే కుమార్ కు పట్టుంది .
వైసీపీ ఆరంభం నుండి జగన్ వెంటే ఉన్న కేజే కుమార్ .. పలు పదవుల నిర్వహణ
కేజే కుమార్ 2004 - 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఛైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2014 - 2019 సంవత్సరాల మధ్య ఆయన సతీమణి శాంతి చైర్ పర్సన్ గా పనిచేశారు. కుమార్ వైసిపి రాష్ట్ర బీసీ విభాగం సెక్రటరీగా, వైసీపీ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పని చేశారు. మొదటి నుండి నగిరి రాజకీయాలపై పట్టు ఉన్న కుమార్, రోజా ల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. చాలా సందర్భాల్లో బాహాటంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.
మంత్రులపై మండిపడుతున్న రోజా
తాజా నిర్ణయంపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కావాలని తమ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి లపై రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే నగరి నేతలతో తనకి పరిచయం ఉన్నప్పటికీ తాను ఎటువంటి వ్యతిరేక వర్గాలకు ప్రోత్సాహం ఇవ్వడంలేదని, కేజే కుమార్ వర్గం కూడా ఎమ్మెల్యే రోజాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ స్వామి చెబుతున్నారు.
Recommended Video
జగన్ తోనే నేరుగా తేల్చుకోవాలని భావిస్తున్న రోజా ..ఏం జరుగుతుందో ?
గతంలో అనేక మార్లు రోజా మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని నగరిలో తనను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా రోజా కేజే కుమార్ భార్య శాంతికి రాష్ట్ర కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడంపై జగన్ తోనే తేల్చుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. ఇక తాజాగా మరోమారు నగరిలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే రోజా వర్సెస్ కేజే కుమార్ ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో నెలకొంది.