అమ్మాయిల బాత్రూంలోకి పోలీసులు ప్రవేశించారు..వెంటనే చర్యలు తీసుకోండి: విద్యార్థులు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రోజున పోలీసులు విద్యార్థులపై కఠినంగా వ్యవహరించారని వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.
ఇంకిలాబ్ జిందాబాద్ నినాదాలతో క్యాంపస్ మార్మోగిపోయింది. విద్యార్థులు పోలీసుల వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. తమ స్నేహితులను పోలీసులు చితకబాదారని అమ్మాయిల బాత్రూంలోకి ప్రవేశించడమే కాదు లైబ్రరీలోకి కూడా వెళ్లి అమ్మాయిలపై పోలీసులు చేయి చేసుకున్నారని ఒక రీసెర్చ్ స్కాలర్ చెప్పారు. పోలీసులు వచ్చిన సమయంలో తామంతా క్యాంపస్లోనే ఉన్నామని అమ్మాయిలు చెప్పారు.
20 మంది పోలీసులు ఏడవ గేట్ నెంబర్ నుంచి వచ్చారు. మరో 50 మంది పోలీసులు వెనకాల గేట్ నుంచి వచ్చారు. అయితే తాము శాంతియుతంగానే నిరసనలు తెలుపుతున్నట్లు చెప్పామని అయినా పోలీసులు వనికుండా తమపై దాడి చేశారని కొందరు విద్యార్థులు చెప్పారు. అమ్మాయిలను కూడా వదలలేదని చెప్పారు.
మరోవైపు ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు వెళ్లేలా విద్యార్థులు చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం కూడా క్యాంపస్లో ఆందోళనలు మొదలవడంతో కొందరు విద్యార్థులు తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. ఆదివారం రోజున క్యాంపస్లోకి పోలీసులు ప్రవేశించడంతో రణరంగంలా తయారైంది.
ఇక ఆందోళనలు కొనసాగించేందుకే విద్యార్థులు డిసైడ్ కావడంతో చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. క్యాంపస్లో ఉండటం తమకు సేఫ్ కాదని భావించిన విద్యార్థులు వారి వారి ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. జనవరి 5వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది యూనివర్శిటీ మేనేజ్మెంట్. అంతేకాదు యూనివర్శిటీ పరిధిలో జరిగే పలు పరీక్షలను వాయిదా వేసింది.