ఆ జనసేన కార్యకర్తల కుటుంబాలకు భారీ ఆర్థిక సహాయం: రూ.12.5 లక్షల చొప్పున
చిత్తూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ భారీ బ్యానర్ను కడుతూ విద్యద్ఘాతానికి గురై మరణించిన ముగ్గురు అభిమానుల కుటుంబాలను ఆదుకోవడానికి, భారీగా ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి పార్టీ ముందుకొచ్చింది. మరణించిన వారి కుటుంబాలకు ఇదివరకు ప్రకటించిన రెండు లక్షల రూపాయల మొత్తాన్ని భారీగా పెంచింది. ఒక్కో కుటుంబానికి 12.5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తామని వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ అంతా ఓ కుటుంబంలా ఉంటుందని, ఎవరికి ఇబ్బంది వచ్చినా స్పందిస్తుందని పేర్కొంది.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం వద్ద ఓ భారీ బ్యానర్ను కట్టడానికి ప్రయత్నించిన ముగ్గురు అభిమానులు విద్యుద్ఘాతానికి గురై మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం మరణించారు. ఈ ఘటన పట్ల పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చేతికి అందివచ్చిన కుమారులను పోగొట్టుకున్న ఆ కుటుంబాలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మొదట్లో పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పుడీ పరిహారం మొత్తాన్ని భారీగా పెంచారు. 12.5 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి మెగా కాంపౌండ్ హీరోలతో పాటు వారితో సినిమాలను తీయనున్న చిత్ర నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయని పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పీ హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఆర్థిక పరిహారాన్ని ప్రకటించారని, రామ్ చరణ్ రెండున్నర లక్షల రూపాయలు, అల్లు అర్జున్ రెండు లక్షల రూపాయలను చెల్లిస్తారని అన్నారు. అలాగే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోన్న వకీల్ సాబ్ యూనిట్, పవన్ కల్యాణ్తో తమ తదుపరి సినిమాలను ప్రకటించిన మైత్రీ మూవీస్, మెగా సూర్య ప్రొడక్షన్స్, ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు చెప్పారు.
Recommended Video
మెగా హీరోలతో సినిమాలను తీస్తోన్న ఇతర ప్రొడక్షన్ సంస్థలు, జనసేన పార్టీ నాయకులు విరాళాల రూపంలో భారీ మొత్తాన్ని సేకరించాయని అన్నారు. ఒక్కో కుటుంబానికి 12.5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తామని అన్నారు. గాయపడ్డ వారికి 50 వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నారు. కష్ట కాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటోన్న పవన్ కల్యాణ్కు పార్టీ తరఫున కృతజ్ఙతలు తెలుపుతున్నామని అన్నారు.