సైనికలాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు పూర్తి: కన్నీటిసంద్రమైన ఎగువరేగడ
చిత్తూరు: హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. సాయితేజ స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కడసారి చూసిన సాయితేజ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు.
ఆదివారం ఉయం బెంగలూరులో సైన్యానికి చెందిన కమాండ్ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతిక కాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్ పోస్టు.. వలసపల్లి మీదుగా ఎగువరేగడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. సుమారు 30 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలు పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పతాకాలతో ర్యాలీని కొనసాగించారు.

అనంతరం గ్రామానికి చేరుకున్న సాయితేజ పార్థీవ దేహాన్ని చూసి భార్య శ్యామల, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యరు. ఎగువరేగడ మైదానంలో ఉంచిన సాయితేజ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సాయితేజ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత సాయితేజ వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.

తమిళనాడులోని కూనూర్ లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 11 మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతాధికారిగా ఉన్న లాన్స్ నాయక్ కూడా ఈ ఘటనలోనే అమరుడయ్యారు.