పైసలతో పారిపోయిన పంచాయతీ కార్యదర్శి.. మరి పింఛన్లు ఎవరియ్యాలే?
చిత్తూరు : ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వోద్యోగి దారి తప్పాడు. ప్రజలకు ఇవ్వాల్సిన పింఛన్ల సొమ్ము కాజేసి పరారయ్యాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. సత్యవేడు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు.. ప్రజలకు పంపిణీ చేయాల్సిన పింఛను డబ్బులతో ఉడాయించాడు. సిరణంబూదూరు, కదిరివేడుపాడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 11 లక్షల రూపాయల పింఛన్లు పంపిణీ చేయకుండా ఆ డబ్బులు తీసుకుని కనిపించకుండా పోయాడు.
పింఛను డబ్బులతో పారిపోయిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు స్వస్థలం శ్రీకాళహస్తి మండలంలోని పానగల్ గా గుర్తించారు పోలీసులు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఇదివరకు ఏర్పేడులో పనిచేసిన సమయంలోనూ నాగరాజు ఇలాగే ప్రవర్తించినట్లు సమాచారం.
పింఛను డబ్బులతో నాగరాజు మాయం కావడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంపీడీవో జ్ఞానేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు విషయం చేరవేయడంతో కలెక్టర్ ప్రద్యుమ్న స్పందించారు. నాగరాజును సస్పెండ్ చేయడమే గాకుండా ఆయన స్థానంలో వేరేవారిని నియమించారు.