చంద్రగిరి రీపోలింగ్: తొలి రెండు గంటలు సజావుగా!
చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏడు కేంద్రాల్లో ఆదివారం ఉదయం రీపోలింగ్ ఆరంభమైంది. పోలింగ్ సజావుగా సాగుతోంది. తొలి రెండు గంటల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సందర్భంగా చంద్రగిరి సెగ్మెంట్ పరిధిలో ఎన్ ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురం, కాలేపల్లి, కుప్పంబాదూరుల్లో రీపోలింగ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
మొదట అయిదు బూత్లల్లో మాత్రమే రీపోలింగ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయినప్పటికీ- చివరి నిమిషంలో కాలేపల్లి, కుప్పంబాదూరులను ఈ జాబితాలో చేర్చింది. ఈ ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 5,451మంది ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు 10 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో మొత్తం 40 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచారు. 20 అసెంబ్లీ, 20 లోక్సభ స్థానాలకు వినియోగిస్తున్నారు.
తెలుగుదేశానికి గట్టి పట్టు ఉన్న ఆయా గ్రామాల్లో దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా ఆ పార్టీ నాయకులు అడ్డుకున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు, సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఈ రీపోలింగ్ను చేపట్టింది.
మరోమారు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి ఎన్నికల అధికారులు భారీ చర్యలు చేపట్టారు. ఈ ఏడు పోలింగ్ బూత్ల పరిధుల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఒక్కో పోలింగ్బూత్ వద్ద సుమారు 250 మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 60 మందికి పైగా ఎన్నికల సిబ్బందిని విధుల్లో నియమించారు.