కొంతకాలంగా అస్వస్థత: చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ మృతి
చెన్నై: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంతకుముందు ఆయనను పరామర్శించేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లారు. శివప్రసాద్ వయస్సు 68.
శివప్రసాద్ గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆయన రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఆ తర్వాత ఇటీవల మూత్రపిండాల సమస్య తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం ఉదయం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆరోగ్యం మరింతగా క్షీణించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శివప్రసాద్ చిత్తూరు నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమించారు.
విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడారు. సమైక్యాంధ్ర కోసం, ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు ఎదుట వివిధ వేషాలలో నిరసన తెలిపిన నేత శివప్రసాద్. కృష్ణుడు, రాముడు, ఎన్టీఆర్.. ఇలా వేషాల్లో నిరసన తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ మొదలు అందరినీ తన వైపు తిప్పుకునే వారు. ఇలాంటి నిరసనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.