రెవెన్యూ లీలలు: పాస్ పుస్తకం ఇవ్వని సిబ్బంది, తహశీల్దార్ కార్యాలయంలో నిద్రపోతూ రైతు ఆందోళన
రెవెన్యూ లీలలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకం కోసం అన్నదాతలు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇటీవల విజయారెడ్డి హత్య కలకలం రేపగా.. కొందరు అవినీతి రెవెన్యూ అధికారుల లీలలు బయటపడుతున్నాయి. పర్సంటేజీ లేనిదే పని ముందుకు కదలదని వాపోతున్నారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తహశీల్దార్ విజయారెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పాస్ పుస్తకం కోసం విజయారెడ్డి వేధించారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే మరికొందరు రెవెన్యూ అధికారుల అవినీతి భాగోతం బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోనూ కొందరు రెవెన్యూ అధికారులు లంచం గడ్డి తింటున్నారు. చెప్పిన పని కూడా చేయకపోవడంతో.. బాధితులు బయటకొచ్చి జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా కురబలకోటలో ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు. తన పాస్ పుస్తకం ఇవ్వడం లేదని వాపోతున్నాడు. గత ఆరు నెలలుగా తనను తిప్పుకొంటున్నాడని పేర్కొన్నాడు. రేపు, మాపు అని చెప్పడంతో ఆ రైతు విసిగివేశారాడు. ఏం చేయాలో తెలియలేదు. ఇంకేముంది తహశీల్దార్ కార్యాలయంలోనే నిరసనకు దిగారు. అక్కడే నిద్రపోతూ తన ఆందోళనను రైతు తెలియజేశాడు. పాస్ పుస్తకం కోసం చుక్కలు చూపిస్తున్నారని వాపోయారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఏకంగా కార్యాలయంలోనే నిద్రపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రైతుకు న్యాయం చేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. లేదంటే తాము కూడా మద్దతిచ్చి ఆందోళన చేడపుతామని హెచ్చరించారు. ఈ వినూత్న నిరసనపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.