పక్క రాష్ట్రాలు జగన్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారు: వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా
ఏపీలో ఇసుక కొరత పై పెద్ద దుమారం నెలకొంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అంతేకాదు ఇసుక కోసం పోరాటాలు, సత్యాగ్రహాలు, దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మాటల దాడిని తిప్పి కొడుతుంది. ఈ క్రమంలోనే నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి తాజాగా వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ దీక్షపై రోజా సెటైర్లు: వేధిస్తున్నారంటూ నారా లోకేష్
పక్క రాష్ట్రాల్లో ప్రజలు జగన్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని రోజా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టి.డి.పి ఓటమి పాలైందని, దారుణంగా ఓటమి పాలు కావడంతో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు చిన్న మెదడు చితికిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కరకట్టలో ఇంటిని కూల్చేయాలని హైకోర్టు చెప్పినా చంద్రబాబు వినడం లేదన్నారు. కావాలని ప్రతి దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆమె చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఇక ఏపీలో జగన్ చల్లని పాదం మోపడంతో వర్షాలొచ్చి, కరువు కాటకాలు లేకుండా పోయాయని ఆమె పేర్కొన్నారు. అయితే ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడితే చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తానికి ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వం పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటానికి వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజాకు కూడా కౌంటర్ ఇచ్చారు. వర్షాలు వరదల వల్లే ఇసుక కొరత ఏర్పడిందని చెప్పిన రోజా టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు.