కరోనా సేవలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే రోజా ఫిదా .. స్వయంగా వండి వడ్డించి కృతజ్ఞత
కరోనా ఏపీలో కలకలం రేపుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఏపీ సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఇక కరోనా మహమ్మారిని కంట్రోల్ చెయ్యటానికి లాక్ డౌన్ ప్రకటించింది సర్కార్ . ప్రజలు బయటకు రాకుండా తగు చర్యలు తీసుకుంటుంది . ఇక ఈ క్రమంలో పోలీసుల పనితీరును పలువురు మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో విశాఖ జిల్లాలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పోలీసుల సేవలకు ఫిదా అయ్యి వాళ్ళ కాళ్ళు మొక్కితే నగరి ఎమ్మెల్యే రోజా పోలీసుల సేవలకు ఫిదా అయ్యి వారి కోసం వంట చేశారు .
Recommended Video
లాక్ డౌన్ అమలులో పోలీసులు , కరోనా బాధితుల సేవలో వైద్య సిబ్బంది
లాక్ డౌన్ అమలులో పోలీసులు, మెడికల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కీలక భూమిక పోషిస్తున్నారు. తమ కుటుంబాలను కూడా వదిలిపెట్టి రాత్రనక, పగలనకా ప్రజలకు కావలి కాస్తున్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు అహర్నిశలు కష్టపడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా , ప్రజలను గుంపులుగా తిరగకుండా చూస్తున్నారు. ఇక దీంతో కంటికి కునుకు లేకుండా శ్రమిస్తున్న పోలీసుల, మెడికల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సర్వీసును ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు.
కరోనా సమయంలో సిబ్బంది సేవలకు రోజా ఫిదా
చిత్తూరు జిల్లాలో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసి చైర్మన్ రోజా కూడా పోలీసులతో పాటు మెడికల్, మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సేవలకు ఫిదా అయ్యారు. ఇప్పటికే కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా మొన్నటికి మొన్న రేషన్ తీసుకునే వారికి సామాజిక దూరం పాటించాలని చెప్పి, స్వయంగా రేషన్ ఇస్తున్న తీరును పర్యవేక్షించిన రోజా ఇక తాజాగా లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్నవారికి స్వయంగా వంట చేసి పెట్టి తన కృతజ్ఞత తెలియజేశారు.
వండి వడ్డించి వారికి కృతజ్ఞత తెలిపిన రోజా
నగరిలో పోలీసులు , మున్సిపల్ సిబ్బంది ,మెడికల్ స్టాఫ్కు భోజనాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే రోజా.రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమె నిత్యం సేవలు చేస్తున్న వారికి భోజన వసతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వంటలను ఇంకెవరి చేతో చేయించకుండా తానే స్వయంగా వంట చేసి పెట్టారు . స్వయంగా కూరగాయలు తరిగి, చేత్తో గరిటె తిప్పి మరీ వంటలు చేసి ఆమె తన ప్రత్యేకత చాటుకున్నారు. పోలీసులకు, వైద్య సిబ్బందికి స్వయంగా వడ్డించిన రోజా వారికి ప్రజలకు చేస్తున్న సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కేవలం ఒక్కరోజుకే పరిమితం కాదని లాక్ డౌన్ ముగిసే దాకా ప్రతీ రోజు 500 మందికి తాను వంటలు చేసి పెట్టేందుకు నగరి ఎమ్మెల్యే రోజా సిద్ధం అయ్యారని తెలుస్తుంది .