రోజా ఒంటరవుతున్నారా: ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతల స్వీకరణ: ఒక్క నేతే హాజరు వెనుక..!
Recommended Video
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవి రాకపోవటంతో ఆవేదనతో ఉన్న రోజాకు ఏపీ సీయం జగన్ కీలక పదవి అప్పగించారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తామని రోజా ప్రకటించారు. రోజా ప్రమాణ స్వీకారానికి పార్టీ నేతల గైర్హాజరు అవ్వటం వెనుక కారణాల పైన ఇప్పుడు చర్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలని కారణం చెబుతున్నా.. కేవలం ఒక్కరంటే ఒక్కరే ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజ రయ్యారు. దీంతో..చిత్తూరు వైసీపీలో ఆధిపత్య పోరు సాగుతోందా... పార్టీలో రోజాకు మద్దతు తగ్గుతుందా అనే చర్చ ఆరంభం అయింది.
ఏపీఐఐసీ ఛైర్మన్గా రోజా బాధ్యతల స్వీకరణ..
వైసీపీ కీలక నేత రోజా ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ పదవి ఇచ్చినందకు ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ మహిళా పక్షపాతిగా ఉన్నారన్నారు. ఏపీలో పారిశ్రామికాభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిఉంటే ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాలుగా సహాయ సహకరాలు అందిస్తామ ని వెల్లడించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సైతం పరిశ్రమల శాఖకు ప్రాధాన్యత ఇచ్చారని.. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ది కోసం కృషి చేస్తామన్నారు. స్థానిక పరిశ్రమల్లో లోకల్ యువతకు 75 శాతం ఉపాధి కల్పించాలనేది జగన్ ఇచ్చిన హామీ అంటూ..దీని కోసం ఒప్పందాల సమయంలోనే నిర్ణయం ఉంటుందని రోజా స్పష్టం చేసారు. ఇక, ఏపీఐఐసీ ద్వారా భూముల కేటాయింపుల్లోనూ పారదర్శకంగా వ్యవహరిస్తామని రోజా స్పష్టం చేసారు. రోజా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
భూమన ఒక్కరే హాజరు..
రోజా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆమె భర్త సెల్వమణితో పాటుగా వైసీపీ సీనియర్ నేత..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాత్రమే పార్టీ నుండి హాజరయ్యారు. రోజా బంధువుల..నగరి నియోజకవర్గం నుండి వచ్చిన నేతలు మినహా పార్టీ ఎమ్మెల్యేలు కార్యక్రమంలో కనిపించలేదు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే రోజా పార్టీలోని దాదాపు అందరు ఎమ్మెల్యేలకు తన బాధ్యత స్వీకరణ గురించి సమాచారం ఇచ్చారు. రావాలని ఆహ్వానించారు. కానీ, కేవలం భూమన కరుణాకర రెడ్డి ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. శాసనసభ జరుగుతున్న కనీసం చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు..లేదా గత అసెంబ్లీలో రోజాతో కలిసి పని చేసిన ఎమ్మెల్యేలు..చివరకు మహిళా ఎమ్మెల్యేలు సైతం బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి రాకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీలో రోజాకు మంత్రి పదవి ఇవ్వకపోవటం ద్వారా రోజాకు సహజంగానే మద్దతు తగ్గిందని..జిల్లా నుండి ఇద్దరు మంత్రులు ఉండం.. అందు నా ఒకరు డిప్యూటీ సీఎం కావటం..మరొకరు జగన్ ప్రభుత్వంలో పలుకుడి ఉన్న మంత్రి కావటంతోనే రోజాతో జిల్లాకు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారా అనే చర్చ సాగుతోంది.
ప్రాధాన్యత తగ్గుతోందా..
వైసీపీ అధికారంలోకి వచ్చే వరకూ రోజా ఫైర్ బ్రాండ్. కానీ, ఇప్పుడు కొద్ది రోజులుగా చూస్తూ రోజా చాలా రిజర్వ్గా ఉంటు న్నారు. నిత్యం చంద్రబాబు..లోకేశ్ పైన వైసీపీ మీద ఏమైనా విమర్శలు చేస్తే టీడీపీ మీద విరుచుకుపడే రోజా కొంత కాలంగా తన దూకుడు తగ్గించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో రోజా అసంతృప్తికి గురవ్వటం..ఆ తరువాత రోజా కు కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వటంతో రోజాలో ఉన్న ఆవేదనను సీఎం జగన్ తగ్గించ గలిగారు. కానీ, జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగానే రోజా కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలో కీలక నేత అయిన రోజా బాధ్యతల స్వీకరణకు మంత్రుల సంగతి పక్కన పెడితే..ఎమ్మెల్యేలు.. పార్టీ సీనియర్లు ఎవరూ హాజరు కాకపోవటం అనేక రకాలైన చర్చలకు కారణమవుతోంది.