సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్ .. తిరుమలలో జగన్తో భేటీ ..వైసీపీలోకి డీకే ఫ్యామిలీ ?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీకి చావు దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయిన నాటినుండి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చాలామంది తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు చాలా మంది టిడిపి నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీతో విభేదించిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే వైసిపి పాట పాడుతున్నారు .
టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న కీలక నేత .. జగన్ సమక్షంలో చేరిక
ఏపీ సీఎం జగన్ ను కలిసిన డీకే శ్రీనివాసులు .. పార్టీ మార్పు సంకేతాలు
ఇటీవల టిడిపి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించి, తాను వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో టీడీపీ నేత కుటుంబం వైసీపీకి జై కొట్టడానికి రెడీ అవుతున్నట్లుగా తాజా పరిణామాలతో తెలుస్తోంది. అయితే అది చంద్రబాబు సొంత జిల్లాలోనే కావటం గమనార్హం . టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు తిరుమల సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పార్టీ మారుతున్నరన్న సంకేతాలను ఇస్తుంది.
జగన్ తో పదినిముషాలు భేటీ .. చక్రం తిప్పుతున్న మిథున్ రెడ్డి
జగన్ తో పదినిమిషాల పాటు భేటీ అయిన డీకే శ్రీనివాసులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, డీకే శ్రీనివాసులును పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. నేడు సీఎం జగన్ తో కూడా మిథున్ రెడ్డినే మాట్లాడించారు . గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా డీకే శ్రీనివాసులు పోటీ చేస్తారు అని అందరూ భావించినప్పటికీ, అప్పుడు డీకే శ్రీనివాసులుకు బదులుగా ఆయన తల్లి సత్యప్రభ ఎన్నికల బరిలోకి దిగారు. రాజంపేట నుండి పోటీ చేసిన ఆమె మిధున్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
ఆ ప్రాజెక్ట్ కోసం కలిశానన్న డీకే ... పార్టీ మార్పుపై దాటవేత
అప్పటినుండి సైలెంట్ గా ఉన్న డీకే కుటుంబం తాజాగా డీకే శ్రీనివాసులు సీఎం జగన్ ను కలవడంతో పార్టీ మారుతున్నారన్న ప్రచారం బాగా జరుగుతుంది. అయితే జగన్ తో భేటీ అయిన శ్రీనివాసులు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలన్నదే తన తండ్రి ఆదికేశవులు చివరి కోరిక అని, అది అనేక రాజకీయ కారణాలతో పూర్తి కాలేదని, దానిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అంతకు మించి పార్టీ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన చెప్పారు. తన రాజకీయ భవిష్యత్ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటానని , ఆ విషయం తర్వాత మాట్లాడతానని చెప్పారు .
చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్ .. వైసీపీ వైపు చూస్తున్న డీకే ఫ్యామిలీ ?
తెలుగుదేశం పార్టీలో చిత్తూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించింది డీకే ఆదికేశవులు కుటుంబం. డీకే ఆదికేశవులు నాయుడు రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా, రెండు సార్లు చిత్తూరు ఎంపీగా పనిచేశారు. ఇక ఆయన మరణానంతరం ఆయన సతీమణి డీకే సత్యప్రభ 2014 ఎన్నికల్లో పోటీ చేసి చిత్తూరు ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీకి జై కొట్టాలని డీకే కుటుంబం చూస్తున్నట్లుగా సమాచారం.