చిన్న కుమార్తెను శూలంతో,పెద్ద కుమార్తె నోట్లో రాగి చెంబు పెట్టి... పోలీసులకే షాక్... మదనపల్లె ఘటనలో సంచలనాలు..
చిత్తూరు జిల్లా మదనపల్లెలో కన్నబిడ్డలను తల్లిదండ్రులే కిరాతకంగా హత్య చేసిన ఘటనలో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి.విద్యావంతులు,ఉన్నత స్థానంలో ఉన్న ఆ తల్లిదండ్రులు విపరీతమైన మూఢ భక్తి,మూఢనమ్మకాల్లో మునిగిపోవడం వల్లే ఈ ఘాతుకం జరిగింది. 'సత్యలోకం తిరిగి వస్తుంది. మా బిడ్డలను మేం తిరిగి బతికించుకుంటాం.. ఒకరోజు గడువు ఇవ్వండి, మా పిల్లలు లేచి వస్తారు' అని ఆ తల్లిదండ్రులు పోలీసులతో చెప్పడం వారి మానసిక స్థితికి అద్దం పడుతోంది. అయితే ఎవరి సూచనల మేరకు ఈ పూజలు చేశారు... ఏం ఆశించి బిడ్డలను చంపుకున్నారన్నది ఇంకా తెలియరాలేదు.
విద్యావంతులు,ఉన్నత స్థానంలో...
మదనపల్లెలోని శివనగర్కి చెందిన ఎన్.పురుషోత్తమ నాయుడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పద్మజ ఓ విద్యా సంస్థలో కరస్పాండెంట్,ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య(27),సాయి దివ్య(22) పిల్లలు ఉన్నారు. అలేఖ్య మధ్యప్రదేశ్లోని భోపాల్లో పీజీ చదువుతుండగా... దివ్య బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. కుటుంబమంతా గతేడాది అగస్టులో శివనగర్లో నిర్మించిన కొత్త ఇంట్లోకి మారారు.
శూలంతో పొడిచి ఒకరిని... రాగి చెంబు నోటిలో పెట్టి మరొకరిని...
స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం... పురోషత్తమ నాయుడు-పద్మజ దంపతులు కొంతకాలంగా విపరీతమైన దైవ భక్తిలో ఉంటున్నారు. ఇంట్లో నిత్యం ఏవేవో పూజలు చేస్తుండేవారు. ఈ క్రమంలోనే ఏకాదశి సందర్భంగా ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మొదట చిన్న కుమార్తె సాయి దివ్యను శూలంతో పొడిచి చంపారు. ఆ తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్తో కొట్టి హతమార్చారు. అనంతరం పురోషత్తం నాయుడు తనతో పాటు కాలేజీలో పనిచేసే ఓ లెక్చరర్కి సమాచారం ఇచ్చాడు. ఆయన నుంచి పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
పోలీసులకే షాక్.. ఇంటి వద్ద బందోబస్తు...
విద్యావంతులు,ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా కన్నబిడ్డలనే పొట్టనపెట్టుకోవడం పోలీసులను సైతం షాక్కి గురిచేసింది. మంత్ర,తంత్రాలకు ఆ దంపతులు ఎందుకు,ఎలా ఆకర్షితులయ్యారన్న దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. తల్లి పద్మజే బిడ్డలను హత్య చేసిందని... భర్త పురోషత్తం నాయుడు కళ్ల ముందే ఈ కిరాతకానికి పాల్పడిందని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. పురోషత్తం నాయుడు-పద్మజ మానసిక స్థితి సరిగా లేనందునా... ఆ ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు.