సోనూసూద్ సాయం: చిత్తూరు మరో రైతు కుటుంబానికి భరోసా, చనిపోవడంతో ఫ్యామిలీకి అండగా...
ఎవరైనా ఆపదలో ఉన్నారా అంటే వినిపించే పేరు సోనూసూద్. అవును.. లాక్ డౌన్ వల్ల కూలీల వెతలతో బయటకొచ్చిన అతని మంచి మనసు.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరా, ఇద్దరా, పలువురికి ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. సాప్ట్ వేర్ శారదకు జాబ్ ఆఫర్, చిత్తూరుకి చెందిన రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ ఇచ్చి తన మనస్సు చాటుకొన్నారు. అయితే జిల్లాకు చెందిన మరో రైతు చనిపోవడంతో సోనూ సూద్ స్పందించారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసానిచ్చారు. శుక్రవారం అతని ప్రతినిధులు కుటుంబాన్ని కలిసి.. సాయం అందించబోతున్నారు.
ఆవు తొక్కడంతో రైతు మృతి..
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరుకి చెందిన వెంకటరామయ్య ప్రమాదవశాత్తు చనిపోయారు. అతని గుండెలపై ఆవు తొక్కడంతో గాయపడ్డారు. దీంతో పలమనేరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గత మూడురోజుల నుంచి వైద్యం తీసుకున్న ఫలితం లేకపోయింది. చనిపోవడంతో.. మృతదేహాన్ని ఆటో వారు రోడ్డుపైనే పడవేసి వెళ్లిపోయారు. దీంతో అతని కూతురు బోరున విలపించారు. ఘటన తెలుసుకొని సోనూసూద్ చలించిపోయారు. వెంకటరామయ్య కూతురిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. శుక్రవారం బెంగళూరు నుంచి సోనుసూద్ మనుషులు పలమనేరు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. ఆర్థికసాయం అందజేస్తారా..? ఉపాధి చూపుతారా అనే అంశం తెలియాల్సి ఉంది.
నాగేశ్వరరావుకు ట్రాక్టర్..
మరోవైపు బతకుదెరువు కోసం మదనపల్లెలో టీ స్టాల్ నాగేశ్వరరావు లాక్ డౌన్ వల్ల గ్రామానికి వచ్చారు. అయితే తన కూతుళ్లతో దున్నడం, ఆ ఫోటోలు సోనూసూద్ చూశారు. దీంతో వెంటనే సోనాలికా ట్రాక్టర్ పంపించేశారు. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధి లేకుండా పో యింది. కానీ తర్వాత అదీ ఫేక్ ఫోటో అని ప్రచారం జరిగినా నాగేశ్వరరావు ఖండించారు. తర్వాత దుక్కి దున్నేందుకు ఇబ్బంది పడే పేద రైతులు ట్రాక్టర్ కావాలని కోరితే తనే స్వయంగా వెళ్లి దున్ని వస్తానని చెప్పారు. కానీ ఆ రైతు మాత్రం డీజిల్ మాత్రం పోయించుకోవాలని కోరారు.
శారదకు జాబ్ ఆఫర్..
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ మార్కెట్ కుదేలైపోయింది. సంస్థలు/ పరిశ్రమలకు కూడా సరైన పని లేకపోవడంతో తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. అలా వరంగల్కి చెందిన శారద.. సాప్ట్ వేర్ ఇంజినీర్ కానీ, ఉద్యోగం కోల్పోయింది. కూరగాయాలు అమ్ముతూ తన ఇంటిని గడుపుతోంది. ఇంకేముంది కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తోన్న టెకీ అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరలైంది. ఈ విషయం తెలుసుకొని సోనూసూద్ స్పందించారు.
కూరగాయాలు అమ్ముతూనే జాబ్..
శారదకు ఉద్యోగం ఆఫర్ చేశాడు. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త యాప్ తయారు చేయించి, అర్హతను బట్టి అందులో ఉద్యోగాలను కల్పిస్తున్నారు. అయితే బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఉద్యోగం ఇస్తారు. అందులోనే శారదకు కూడా జాబ్ కల్పించారు. అయితే శారద మాత్రం సోనూసూద్ ఆఫర్ తీసుకోలేదు. శ్రీ నగర్ కాలనీలో కూరగాయాలు అమ్ముతూ జీవిస్తున్నారు. ఇటీవల రూ.5 వేల విలువగల ఆమె కూరగాయాలను కొందరు ఆకతాయిలు దొంగిలించారు.