మళ్లీ సొంత జిల్లాకు చంద్రబాబు: వైసీపీనే టార్గెట్: రోజంతా అక్కడే: ఈ రెండు కారణాలతో
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రోజంతా అక్కడే ఉండబోతోన్నారు. తన సొంత జిల్లా పర్యటనకు చంద్రబాబు పర్యటించబోతోండటం వారం రోజుల వ్యవధిలో రెండోసారి. మొన్నటికి మొన్నే కుప్పంలో తన మూడు రోజుల పర్యటనను ముగించుకున్న ఆయన మళ్లీ సొంత జిల్లాకే వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
టీడీపీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో తమ నామినేషన్లను దాఖలు చేయనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారనే కారణంతో ఆయన ధర్నాలు, ఆందోళనలు చేయనున్నారు. ఒకవంక మున్సిపల్ ఎన్నికలు, మరోవంక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ముంచుకుని వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.
కుప్పం పర్యటనను ముగించుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్కు వెళ్లారు. అక్కడే ఉంటున్నారు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో చిత్తూరుకు చేరుకుంటారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారనే కారణంపై ఆయన ఈ ధర్నా చేయనున్నారు.
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. అనంతరం తిరుపతికి బయలుదేరి వెళ్తారు. చేరుకుంటారు. సాయంత్రం 5.45 నిమిషాలకు తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధర్నా ముగిసిన తరువాత తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయానికి వెళ్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. పనబాక లక్ష్మి సహా ఇతర సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్తారు.