టీడీపీ నేతల వాహనాలపై రాళ్ల దాడి: విధ్వంసం: గాయాలు: మంత్రి హస్తం?: సిగ్గులేదా?: నారా లోకేష్
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నాయకుల వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వారు. కార్ల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనలో ఒకరికి తలకు గాయమైంది. రక్తమోడింది. ఈ దాడిలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. వాటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి వెనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హస్తం ఉందని విమర్శిస్తున్నారు.
రోగులకు మరణశిక్ష: కేంద్రంపై భగ్గు: తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు క్లోజ్: డాక్టర్ల నిరసన
మదనపల్లి వద్ద ఘటన..
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి టీడీపీ నాయకులు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్ తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్తుండగా.. మదనపల్లి సమీపంలోని అంగళ్లు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీనితో వారి కాన్వాయ్లోని మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. వాటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో ఒకరికి గాయాలయ్యాయి. తలకు గాయమైంది. వారిద్దరూ గత ఏడాది టీడీపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి శంకర్ యాదవ్ తంబళ్లపల్లె నుంచి పోటీ చేశారు.
ఈ దాడితో నేతల ఆగ్రహం..
ఈ దాడితో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. నల్లారి కిశోర్.. శంకర్ యాదవ్ సంఘటనా స్థలంలోనే బైఠాయించారు. ఈ దాడికి వైఎస్ఆర్సీపీ నేతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తమపై దాడులకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని శాంతింపజేశారు.
పోలీసులకు సిగ్గులేదా?
ఈ ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పట్టపగలు వైసీపీ నేతలు దాడులకు బరి తెగిస్తున్నారని విమర్శించారు. జంగిల్ రాజ్యంలో ప్రజలకు, ప్రతిపక్షనేతలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. చనిపోయిన టిడిపి కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తోన్న తమ పార్టీ నేతల కాన్వాయ్పై దాడి చోటు చేసుకున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని అన్నారు.
అరాచకాంధ్రప్రదేశ్గా
రాష్ట్రాన్ని వైసీపీ నేతలు అరాచకాంధ్రప్రదేశ్గా మార్చేశారని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకూ అందరూ ఫ్యాక్షన్ మనస్తత్వం వున్నవారేననే విషయం ఈ ఘటనతో మరోసారి రుజువైందని మండిపడ్డారు. పట్టపగలు దాడులకు పాల్పడుతోంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటోన్న పోలీసులు వైసీపీ నేతల కోసం పనిచేయడం సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు పోలీసులు ప్రజా రక్షకభటులా? లేక ప్రజలపై కక్షకట్టిన భటులా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు.