సీయం సొంత జిల్లాలో టిడిపికి షాక్ : కిరణ్ సోదరుడి గెలుపు కు చెక్..!
టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో టిడిపి కి షాక్ తగిలింది. ముఖ్యమంత్రి 2014 ఎన్నికల్లో ఏరి కోరి సీటు ఇచ్చిన మైనార్టీ నేత పార్టీని వీడారు. ఇప్పుడు ఇది చంద్రబాబు కే కాదు..మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ గెలుపు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో రాజకీయంగా పై చేయి సాధించేందుకు టిడిపి - వైసిపి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో రాజకీయంగా రంజుగా మారింది.
చిత్తూరు జిల్లా పీలేరు నియోజవర్గం లో టిడిపి కి మాజీ ఇన్ఛార్జ్..మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా చేసారు.
చిత్తూరు జిల్లాలో నారా - నల్లారి కుటుంబాల మధ్య రాజకీయంగా వైరుధ్యం ఉంది. అయితే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి లో చేరటం తో ఆయనకు కిరణ్ కుటుంబానికి రాజకీయంగా పెట్టని కోట లాంటి పీలేరు బాధ్యతలు చంద్రబాబు అప్పగించారు. 2014 లో సైతం ఇదే నియోజకవర్గం నుండి కిషోర్ సమైక్యాంధ్ర పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసిపి అభ్యర్ధి రామచంద్రా రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టిడిపి మైనార్టీ లకు ఇచ్చిన సీటు ఇదొక్కటే. ఇక, ఇప్పుడు పాతికేళ్లుగా టిడిపి కోసం పని చేసిన బలమైన మైనార్టీ నేత రాజీనామా తో టిడిపి తో పాటుగా.. కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు మీద ప్రభావం పడుతుందని స్థానిక నేతలు విశ్లేషిస్తున్నా రు. అయితే, టిడిపి నేతలు ఇక్బాల్ ను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నా.. తన రాజీనామా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేస్తున్నారు.