పొలానికి వెళ్లి వాగులో చిక్కుకుపోయిన రైతులు... చెట్టుకు వేలాడుతూ బిక్కుబిక్కుమంటూ...
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలోని ఓ వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పొలంలో మోటార్ బిగించేందుకు వెళ్లిన రైతులు వాగు ఉప్పొంగడంతో అందులోనే చిక్కుకుపోయారు. మల్లెమడుగు రిజర్వాయర్కు నీటి ఉధృతి పెరగడంతో వాగు ప్రవాహం పెరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
వాగులో చిక్కుకుపోయిన రైతులను వెంకటేశ్, ప్రసాద్, లోకేష్లుగా గుర్తించారు. వాగును దాటే క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ముగ్గురూ కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వాగు మధ్యలో ఉన్న ఓ చెట్టుకు వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం రేణిగుంట డీఎస్పీ, సీఐ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బలగాల ద్వారా లేదా హెలికాప్టర్ సాయంతో రైతులను వాగు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తమవాళ్లను ఎలాగైనా రక్షించాలని ఆ ముగ్గురి కుటుంబాలు అధికారులను వేడుకుంటున్నారు.
కాగా,నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలాచోట్ల చెరువులు,రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు,నెల్లూరు,కడప,ప్రకాశం జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. తిరుమలలో భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులకు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో వాటిని తొలగించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే హెల్ప్ లైన్ నంబర్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తిరుపతి పట్టణంలో భారీ వర్షానికి లోతట్టు కాలనీలు నీటమునిగాయి.
తుఫాన్ ప్రభావ పరిస్థితులను కేంద్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడామని... అవసరమైన సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు.