చిత్తూరులో కలకలం.. ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం..!
చిత్తూరు : ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన నగరంలో కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలతో పాటు ఒక అమ్మాయి అదృశ్యం కావడం చర్చానీయాంశంగా మారింది. ఇంతకు ఈ ముగ్గురిని ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేదంటే తమకు తాము కనిపించకుండా పోయారా అనేది సస్పెన్స్గా మారింది. దసరా సెలవులు ముగిసి స్కూల్ ప్రారంభమైన నేపథ్యంలో వీరు అదృశ్యం కావడంతో చదువుపై ఇష్టం లేక పారిపోయారా అనేది మరో కోణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరులో ముగ్గురు విద్యార్థుల అదృశ్యం స్థానికంగా హాట్ టాపికైంది. గిరింపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న సౌమ్య, కౌశల్య, ఢిల్లీ బాబు అనే స్టూడెంట్స్ గురువారం (10.10.2019) నుంచి కనిపించకుండా పోయారు. ఆ క్రమంలో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దసరా సెలవుల నేపథ్యంలో గురువారం నాడే స్కూల్ రీ ఓపెన్ అయింది. అయితే స్కూల్కు వెళతామని ఇంట్లో చెప్పిన ఈ ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోవడం కలకలం రేపింది.
వరంగల్ తోపులాటలో ఏసీపీ తప్పులేదు.. మహిళ కొంగు లాగారనేది అసత్యం.. సీపీ వివరణ
ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన సదరు విద్యార్థులు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. ఆ క్రమంలో స్కూల్కు వెళ్లి విచారించగా.. గురువారం నాడు ఈ ముగ్గురు అసలు పాఠశాలకే రాలేదనే సమాధానం వచ్చింది. బంధువుల ఇంటికి వెళ్లారేమోననే అనుమానంతో తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఏమి చేయాలో తోచక గురువారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.