Tirumala: వైకుంఠ ఏకాదశికి ముమ్మర ఏర్పాట్లు: 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం
తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం కల్పించడాని టీటీడీ ఇదివరకే నిర్ణయించింది.
Amaravati: ధర్నా శిబిరాల్లో విష్ణు సహస్ర పారాయణాలు, గోవిందనామాలు..!
ఈ 10 రోజుల వ్యవధిలో కనీసం 15 లక్షలమంది భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనం కల్పించడానికి హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా 5 నుండి 7వ తేదీ వరకు ఆర్జిత సేవలతో పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలు, 300 రూపాయల దర్శన టికెట్లు, సర్వదర్శనం, దివ్యదర్శనం, అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశామని వివరించారు. 7న వైకుంఠ ద్వాదశి నాటికి 300 రూపాయల టికెట్లు మొత్తం అయిదువేలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో ఇదివరకే భక్తులకు కేటాయించామన్నారు. జనవరి 6న ఉదయం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.
కంపార్ట్మెంట్లు, క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీల్లో గల షెడ్లలో వేచి ఉన్న భక్తులకు ప్రణాళికాబద్ధంగా అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఏకాదశి నాడు 3 లక్షల మంచినీటి బాటిళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లలో వేచి ఉన్న భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కల్పించేందుకు జనవరి 5న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నామసంకీర్తన యజ్ఞం నిర్వహిస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు.