శ్రీవారి భక్తులకు ఇక ఉచిత లడ్డూ: 250 కోట్ల భారాన్ని తగ్గించుకునేందుకు రాయితీ ఎత్తివేత?
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు తీపికబురును అందించింది. శ్రీవారిని ధర్శించుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డూ అందిస్తామని మంగళవారం ప్రకటించింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 6 నుంచి ఉచిత లడ్డూ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
ఇక ప్రతీ భక్తుడికీ ఉచిత లడ్డూ..
ఇప్పటి వరకూ కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఉచిత లడ్డూను అందజేస్తుండగా.. ఇక నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతీ భక్తుడికీ ఉచిత లడ్డూను అందజేస్తారు. ప్రస్తుతం రోజుకు 20వేల లడ్డూలను టీటీడీ అందిస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రతీ భక్తుడికీ ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇకపై రోజుకు 80వేల లడ్డూలను భక్తులకు అందించనుంది.
రాయితీ వేసేందుకు..
ఇది ఇలావుంటే, శ్రీవారి లడ్డూపై ఇప్పటి వరకూ ఇస్తున్న రాయితీిన ఎత్తివేసేందుకు టీడీపీ సిద్ధమైంది. దివ్య దర్శనం, టైంస్లాట్, సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులకు రెండు లడ్డూలు రూ. 10, మరో రెండు రూ. 25 ధరతో మొత్తంగా రూ. 70కి నాలుగు లడ్డూలు అందిస్తోంది. టీటీడీ ఉద్యోగులకు రూ. 5 చొప్పున విక్రయిస్తోంది. రూ. 300 టిక్కెట్పై ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, విశేష ఆర్జిత సేవలకు వచ్చి దర్శించుకునేవారికి రెండేసి లడ్డూలను ఉచితంగా ఇస్తోంది.
ఇక రూ. 50కి..
ఇకపై ఈ రాయితీలన్నింటినీ ఎత్తేస్తూ ప్రతి భక్తుడికీ ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చి.. ఒక్కో లడ్డూకు రూ. 50 చొప్పున కోరుకున్నన్ని లడ్డూలు విక్రయించనుంది. కాలినడకన వచ్చినవారికి యథాతథంగా ఒక లడ్డూ ఉచితంగా వస్తుంది. తిరుమలకు నిత్యం సుమారు 75వేల నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. దీంతో వారికి సుమారు 3లక్షల లడ్డూలు అందజేస్తున్నారు.
250 కోట్ల భారం తగ్గించుకునేందుకు..
కాగా, ఒక్కో లడ్డూ తయారీకి సుమారు రూ. 40 ఖర్చవుతోందని టీటీడీ చెబుతోంది. ఇందు కోసం రూ. 580 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రసాదంపై రాయితీ వల్ల ఏటా దాదాపు రూ. 250 కోట్లకుపైగా భారం పడుతోందని టీటీడీ తేల్చింది. ఈ క్రమంలోనే రాయితీలను ఎత్తివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇక కళ్యాణం పెద్ద లడ్డూను సామాన్య భక్తుకలు అందుబాటులోకి తెచ్చేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇటీవల నిర్వహించిన టీటీడీ బోర్డు సమావేశంలో ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సభ్యులు ఈ ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలిసింది.